కరీంనగర్ కార్పొరేషన్, మార్చి 23: మంత్రి పొన్నం ప్రభాకర్ పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి విమర్శించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆయన ఆర్డీవో, తహసీల్దార్కు కాన్ఫరెన్స్ కాల్ చేసి కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే చేతికి ఇవ్వొద్దని చెప్పడం సిగ్గుచేటని, ‘ఆయనో ఆవేశం స్టార్’ అని ఎద్దేవా చేశారు. తాను హుజూరాబాద్ ప్రజలు ఓట్లు వేస్తే గెలిచానని, మరి మంత్రి ఇక్కడి ప్రజలకు వ్యతిరేకంగా ఉండాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఆర్డీవోపై చర్య తీసుకోవాలని సీఎస్కు ఫిర్యాదు చేసిన మంత్రి పొన్నంను మంత్రి వర్గం నుంచి ఎందుకు బర్తరఫ్ చేయకూడదో చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్లో మాజీ ఎంపీ వినోద్ క్యాంపు కార్యాలయంలో కౌశిక్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్డీవో, తహసీల్దార్ నుంచి తనకు ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదని, దీనిపై విచారణకు సిద్ధమని ప్రకటించారు. ఈ ఆడియో మంత్రి కార్యాలయం నుంచే లీక్ అయ్యిందని, అది కూడా తెలుసుకొలేని పొన్నం ప్రభాకర్ అమాయకులైన ఆర్డీవో, తహసీల్దార్ను బలిచేస్తున్నారని దుయ్యబట్టారు.
హుస్నాబాద్లోని అమ్మనగుర్తికి చెందిన తిరుపతిగౌడ్ మాట్లాడితే మంత్రి అని మరిచిపోయి ఇష్టారాజ్యంగా బూతులు తిట్టారని విమర్శించారు. కరీంనగర్ ఎంపీగా కొనసాగిన సమయంలోనూ పొన్నం ఇలాగే ఎగిరిపడితే ఇక్కడి ప్రజలు తన సొంత డివిజన్లోనే 23 ఓట్లు కూడా తెచ్చుకోని గొప్ప లీడర్ అని విమర్శించారు. అధికారులు కూడా ప్రోటోకాల్ను ఉల్లంఘించి ఇబ్బందిపడొద్దని సూచించారు. మంత్రి మాటలు విని నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోవద్దని కోరారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినా కమలాపూర్లో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం సంతోషమేనని కానీ, చెక్కులతోపాటు కాంగ్రెస్ చెప్పిన తులం బంగారం కూడా ఇచ్చి ఉంటే బాగుండేదని అన్నారు. పోలీసులకు రావాల్సినా పీఆర్సీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, మరి ఎందుకు ఇప్పించటం లేదని ప్రశ్నించారు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పోలీసులకు పీఆర్సీ ఇప్పించినట్టు తనకు సమాచారం ఉన్నదని, మరీ కరీంనగర్ జిల్లాలో పోలీసులకు ఇప్పించడంలో మంత్రి పొన్నంకు చేతకావటం లేదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన్ను కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఇంత కన్నా సాక్ష్యం ఇంకేం ఉంటుందని ప్రశ్నించారు.