చేర్యాల : తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నాయకత్వలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించాలని కోరుకుంటూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి(MLA Yadagiri Reddy) గురువారం కొమురవెల్లి మల్లన్నకు ముడుపు కట్టారు. పార్టీ అఖండ మెజార్టీతో విజయం సాధించాలని చేర్యాల పట్టణం నుంచి మద్దూరు, ధూళిమిట్ట, కొమురవెల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలతో మల్లన్న క్షేత్రానికి(Mallanna Temple) వెయ్యి బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ఆలయంలో గంగరేగు చెట్టు వద్ద బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని , సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించాలని కోరుతూ చెట్టుకు ముడుపు కట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలల్లో (Elections) సీఎం కేసీఆర్ వ్యూహాలకు ప్రతిపక్ష పార్టీల అడ్రస్లు గల్లంతు కానున్నాయని పేర్కొన్నారు. సీఎం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పనులతో ప్రజలు సంతోషంగా ఉన్నారని వివరించారు. ప్రతిపక్ష పార్టీలు చేసే అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు.
50 సంవత్సరాల పాటు పాలించిన కాంగ్రెస్ (Congress), 10 సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ(BJP) పార్టీలు ప్రజలకు చేసింది ఏమి లేదన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను కాపాడుకుంటూ అవినీతికి అస్కారం లేకుండా పాలన కొనసాగిస్తున్నారని వెల్లడించారు. కేసీఆర్ చలువ, మంత్రి హరీశ్రావు(Minister Harish Rao) శ్రద్ధతో కొమురవెల్లి మల్లన్న క్షేత్రం అభివృద్ధి పథంలో పయణిస్తున్నదని అన్నారు.
ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త సైనికుని వలే పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ జనగామ నియోజకవర్గ కోఆర్డినేటర్ గుజ్జ సంపత్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ముస్త్యాల నాగేశ్వర్రావు, ఎంపీపీ, జడ్పీటీసీలు, ఏఎంసీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, మల్లన్న ఆలయ చైర్మన్ గీస భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.