జహీరాబాద్ జనవరి 7 : సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థి స్వప్న (17 )ఆత్మహత్య చేసుకోవడంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం జహీరాబాద్ మండలంలోని రంజుల్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో(Ranjul gurukulam) ఇంటర్ బైపిసి మొదటి సంవత్సరం చదువుతున్న స్వప్న ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. విద్యార్థిని స్వప్న ఫ్యానుకు ఉరివేసుకున్న విషయాన్ని తోటి విద్యార్థులు గమనించి ఉపాధ్యాయులకు తెలపడంతో వెంటనే ఫ్యాన్ నుంచి కిందికి దించారు.
విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స కోసం జహీరాబాద్ సర్కార్ దవఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విద్యార్థిని మృతి పై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. వివిధ కుల సంఘాలు విద్యార్థినుల తల్లిదండ్రులు భారీ సంఖ్యలో రంజుల్ గురుకుల పాఠశాలకు చేరుకొని విద్యార్థిని మృతిపై న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాల లోపనికి వెళ్లేందుకు ఎవరికి అనుమతించకపోవడంతో గేటు ముందు ఆందోళనకు దిగారు.
దళిత విద్యార్థి మృతి పై న్యాయ విచారణ చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు(MLA Manikya Rao) డిమాండ్ చేశారు. పాఠశాల లోనికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో గేటు ముందు బైఠాయించి విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేసే వరకు కదిలేది లేదని బైఠాయించారు. దీంతో అక్కడ పరిస్థితి విషమంగా ఉండడంతో పోలీసులు భారీ సంఖ్యలో చేరుకున్నారు.