దేవరుప్పుల, మార్చి 12: రైతులకు సాగునీరందించడంలో జరిగిన జాప్యానికి క్షమాపణలు చెప్తున్నానని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి ప్రకటించారు. ‘రైతులకు సాగునీరివ్వాల్సిన బాధ్యత మాది. కనుక నేను బాధ్యత వహిస్తా. అధికారుల తప్పు కాకున్నా వాళ్లందరి రెస్పాన్స్బిలిటీ నాదే. రైతుల పక్షాన నేనుండాలి. రేపటిలోపు కచ్చితంగా నీళ్లొస్తయ్. రైతన్నలకు అండగా ఉంటా’ అని తెలిపారు. రైతుల ఆందోళన నేపథ్యంలో మంగళవారం ఆమె నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్ తండాకు చెందిన రైతులు తమకు సాగునీరు అందించాలని పది రోజుల క్రితం ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి వద్దకు వెళ్లి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని పలువురు రైతులు సోమవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎదుట వాపోయారు. దీంతో ఎర్రబెల్లి నేరుగా దేవాదుల ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి తన హయాంలో దేవరుప్పులకు పుష్కలంగా సాగునీరు అందించామని, చెరువులు నింపామని, వాగులు పారిచ్చామని, ఇప్పుడేమైందని ప్రశ్నించారు. రేపటిలోపు నీరివ్వకుంటే సెక్రటేరియట్ ముందు రైతులతో ధర్నాకు దిగుతానని హెచ్చరించారు. దీంతో అధికారులు నీళ్లు వదిలేందుకు సిద్ధపడ్డారు. మరోవైపు మంగళవారం దేవరుప్పుల, పాలకుర్తి మండల కేంద్రాల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించడంతో సాయంత్రం స్టేషన్ఘన్పూర్ రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి రైతులకు క్షమాపణలు చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతున్నది. ఇదిలా ఉండగా.. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య దేవాదుల ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడుతూ.. దేవరుప్పుల ప్రాంతానికి సాగునీరు తగ్గించి, యాదాద్రిభువనగిరి జిల్లా గుండాల మండలానికి ఎక్కువ నీరు విడుదల చేయాలని కోరారని సమాచారం. ఈ విషయంలో రైతులు తన వెంట పడుతున్నారనే వీడియో వైరల్ కావడం చర్చనీయాంశమైంది. బీర్ల ఐలయ్య దేవరుప్పుల మండలానికి నీరు తగ్గించాలనడంపై స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.