నార్కట్పల్లి(నల్లగొండ) : రాజకీయ లబ్ధి కోసం బీజేపీ కుటిల యత్నాలకు పాల్పడుతున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(Mla Lingaiah) ఆరోపించారు. బీఆర్ఎస్(Brs) పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక నీచ రాజకీయాలకు పాల్పడుతున్నదని విమర్శించారు. నకిరేకల్లోని ఎమ్మెల్యే కాంపు కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు .
గతంలో కులం, మతం పేర రాజకీయాలు చేసిన బీజేపీ ప్రస్తుతం చదువులు అడ్డు పెట్టుకొని చేస్తున్నదని విమర్శించారు. గ్రూప్-1 పేపర్ లీకేజీలో నిందితుడు రాజశేఖర్, పదో తరగతి పరీక్ష పత్రం లీకేజీకి కారణమైన ప్రశాంత్ ఇద్దరూ బీజేపీ కార్యకర్త(BJP members)లేనని తెలిపారు. విద్యార్థులు, యువకులను ఆగం చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకునే వారికి తగిన బుద్ధి చెబుతామన్నారు.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి పథకాలు తేలేదని విమర్శించారు. నిధుల మంజూరులో కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు.