నమస్తే తెలంగాణ న్యూస్నెట్వర్క్, ఏప్రిల్ 18: బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాలు రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు హాజరై కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు. ఆటపాటలతో సందడి చేస్తున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకొని కొన్నింటిని అప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. కార్యకర్తల కుటుంబ సభ్యులతో కలిసి నేతలు సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. మొత్తానికి ఆత్మీయతను పంచుతూ పండుగ వాతావరణంలో సాగుతున్నాయి. మంగళవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ లక్కారంలో జరిగిన సమ్మేళనంలో ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్రావు, విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు దేవీప్రసాద్, సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు.
కన్నీరు పెట్టిన ఎమ్మెల్యే కూసుకుంట్ల
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అప్పటి పరిస్థితులను గుర్తుతెచ్చుకొని భావోద్వేగానికి గురై కంటనీరు పెట్టుకున్నారు. ‘నేను ఉద్యమంలో పనిచేస్తానని 2003లో కళ్లెం యాదగిరిరెడ్డితో చెప్పా. వెంటనే ఆయన హరీశ్రావు దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లి పార్టీలో చేరిపించిండ్రు. అప్పటి నుంచీ హరీశ్ అన్న సహకరిస్తున్నారు. ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కరిస్తున్నారు. తర్వాత సాంబశివుడిని హత్య చేసినప్పుడు.. అన్న దగ్గరికి వెళ్లి పరిస్థితి బాగోలేదని చెప్తే.. వెంటనే పోలీస్ కమిషనర్ దగ్గరికి తీసుకెళ్లి పిస్టల్ లైసెన్స్ ఇప్పించిండు’ అని ఎమ్మెల్యే కూసుకుంట్ల కంటనీరు పెట్టారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి భుజం తట్టి కొండంత ధైర్యాన్ని ఇచ్చారని భావోద్వేగానికి గురయ్యారు. పార్టీని నమ్ముకున్నందుకు తనకు ఈ స్థానం వచ్చిందని కూసుకుంట్ల చెప్పారు.
బీఆర్ఎస్ లేకపోతే రోడ్డున పడేటోళ్లం
కూలీ పని చేసుకుంటూ బతికేటోళ్లం. నా భర్త పానం బాగుండేది కాదు. కేసీఆర్ సార్ అంటే ఆయనకు చాల ఇష్టం. బీఆర్ఎస్ వాళ్లతో తిరిగేవాడు. వాళ్లు నా భర్తకు పార్టీ సభ్యత్వం ద్వారా ఇన్సూరెన్స్ చేసిండ్రు. కొద్దిరోజుల తర్వాత అనారోగ్యంలో చనిపోయిండు. పార్టీ నాయకులు మా ఇంటికి వచ్చి ఎమ్మెల్యే వినయన్న రమ్మన్నాడు అని చెప్పితె పోయిన. మీ కుటుంబానికి అండగా ఉంటానని వినయన్న హామీ ఇచ్చి.. పది రోజులకే రూ.2 లక్షల చెక్కు ఇప్పించిండు. బీఆర్ఎస్ లేకపోతే మా కుటుంబం రోడ్డున పడేటిది. మా కుటుంబాన్ని ఆదుకున్న కేసీఆర్, వినయన్న, నాయకులకు రుణపడి ఉంట.
-కంకనాల రాజేశ్వరి, బీఆర్ఎస్ కార్యకర్త, హనుమకొండ