హైదరాబాద్ : నాగార్జున సాగర్, హుజూర్నగర్లో బీజేపీ పరిస్థితి ఏంటని బీజేపీ ప్రశ్నించుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద సూచించారు. టీఆర్ఎస్ ఎల్పీలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డితో కలిసి సోమవారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీతో లోపాయికారి ఒప్పందం చేసుకొని హుజూరాబాద్లో ఈటల రాజేందర్ గెలిచారని ఆరోపించారు. బీజేపీని దేశవ్యాప్తంగా గద్దెదించాలని కమ్యూనిస్టులు టీఆర్ఎస్తో పొత్తు కుదుర్చుకున్నారన్నారు. బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి.. విక్స్ బిళ్ల వివేక్గా పేరు పెట్టుకుంటే మంచిందని సూచించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ లాంటి నాయకుడు కేంద్రంలో మంత్రిగా ఉండాలని మాట్లాడారని గుర్తు చేశారు. మునుగోడులో ఆరు గుర్తులతో 7వేల ఓట్లు కోల్పోయామని, ఆ గుర్తులు లేకుంటే టీఆర్ఎస్కు 18వేల వరకు మెజార్టీ వచ్చేదన్నారు.
మునుగోడులో రూ. 8 వేల కోట్లకు కోమటిరెడ్డి అమ్ముడు పోయారని అన్నారు. లగడపాటి, కోమటిరెడ్డి ఇద్దరు ఒక్కటేనని, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో లగడపాటి ఏ విధమైన వ్యవహరించారో, తెలంగాణ వచ్చాక అభివృద్ధి అంశాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తో అదే విధమైన సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శించారు. బీజేపీతో అనేక రాష్ట్రాల్లో వివిధ పార్టీలు పొత్తులు ఉన్నాయని వారు కూడా కాళ్ల బేరంతోనే పొత్తులు పెట్టుకున్నారా అంటూ ప్రశ్నించారు. దుబ్బాక, బీహార్లో 2వేల ఓట్లతో మాత్రమే బీజేపీ గెలిచిందని, అదొక విజయమేనా అనాలా? అంటూ మండిపడ్డారు. ఎవరైనా ప్రజల తీర్పును గౌరవించాలన్నారు.
డబ్బు, మద్యం పంచి ఎన్నికల్లో గెలవాలనే అహంకారంతోనే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని, ఓడిపోతే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని చెప్పారని, ఇప్పుడు ఏమైందంటూ రాజగోపాల్ రెడ్డిని వివేకానంద ప్రశ్నించారు. ఆ మాటలకు కట్టుబడి ఉంటారా, నోరు అదుపులో ఉంచుకోని మాట్లాడాలని సూచించారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని.. ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని బూర నర్సయ్యను చూసి చెప్పవచ్చన్నారు. ఆయన రాజకీయ పరిజ్ఞానం పెంచుకోవాలని, రాజకీయ అవగాహనతో మాట్లాడాలని సూచించారు. బీజేపీకి తెలంగాణలో తావు లేదన్నారు. మునుగోడు సభలో అమిత్ షా ప్రభుత్వాన్ని కూలగొడుతామని అన్నారని, మునుగోడులో ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పారన్నారు. కేసీఆర్ను కట్టడి చేయడానికే ఉప ఎన్నిక తీసుకవచ్చామని బీజేపీ నేతలు జాతీయ స్థాయిలో చెబుతున్నారని.. అయినా కూడా కేసీఆర్ జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించబోతున్నారని స్పష్టం చేశారు.