హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ధరణిపై తప్పుడు ప్రచారం చేయడం అలవాటైపోయిందని, రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్కు వెళ్తే ప్రజలు ఆయనను బట్టలిప్పి కొడుతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. రేవంత్రెడ్డి రెవెన్యూరెడ్డిగా మారారని ఎద్దేవా చేశారు. కోర్టు మొట్టికాయలు వేసినా ఆయన తీరు మారడంలేదని మండిపడ్డారు. సమాచార హక్కు ద్వారా దరఖాస్తులు పెట్టి వసూళ్లకు పాల్పడటం, ఇష్టమొచ్చిన మాట్లాడటం, మాయమాటలు చెప్పడం రేవంత్రెడ్డికి పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో కేపీ వివేకానంద మాట్లాడుతూ రేవంత్రెడ్డి తన వైఖరి మార్చుకోకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ధరణి గురించి రేవంత్రెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ధరణిలో ఇప్పటివరకు 27 లక్షల లావాదేవీలు జరిగాయని తెలిపారు.
తిమ్మాపూర్లోని భూములను 2006లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రిజిస్టర్ చేశారని వివేకానంద తెలిపారు. తన పదవిని కాపాడుకోవడానికే బీఆర్ఎస్పై, సీఎం కేసీఆర్ కుటంబ సభ్యులపై రేవంత్రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ధరణిలో ఏదైనా తప్పులు జరిగితే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉన్నదని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో హకుదారుల భూములను ఏదో కారణంతో నిషేధిత జాబితాలో పెట్టారని, ఇప్పుడు ధరణితో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతున్నాయని చెప్పారు.
ధరణిని ప్రజలు బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారని, అతి తక్కువ కాలంలో లక్షల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయని తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ధరణి వంటి పోర్టల్ను తెచ్చే దమ్ముందా? అని నిలదీశారు. రేవంత్రెడ్డి చెప్తున్న మూడు సర్వే నంబర్లు ఇప్పటికీ ధరణిలో భూదాన్ పేరుతోనే ఉన్నాయని, తిమ్మాపూర్లోని పట్టా భూముల గురించి రికార్డుల్లో తనిఖీ చేసుకోవచ్చని సూచించారు. తెలంగాణలో రాబోయేది ముమ్మాటికీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించడం ఖాయమని పేర్కొన్నారు. చర్లపల్లి జైలుకు వెళ్లడం అలవాటుగా మారిన రేవంత్రెడ్డి.. అందరూ తనలాగే వెళ్తారన్న భ్రమల్లో ఉన్నారని, అందులోంచి బయటకు రావాలని సూచించారు.