హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): గుజరాత్లో వరదలు వస్తే సహాయం చేసిన ప్రధాని మోదీకి భద్రాచలం వరదలు కనిపించడం లేదా? అని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రశ్నించారు. రాష్ర్టానికి నిధులు తీసుకొనిరాలేని కిషన్రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి ఉపయోగమేమిటని నిలదీశారు. కేంద్రం నుంచి పైసా కూడా తీసుకొనిరాలేని బీజేపీ నేతలకు సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. మంగళవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు వరదల్లో అవస్థ పడుతుంటే కిషన్రెడ్డి, బండి సంజయ్ మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధలో ఉన్న జనాలను పట్టించుకోని పార్టీ బీజేపీ అని దుయ్యబట్టారు.
రాకపోకలకు అంతరాయం ఉన్నా సరే సీఎం కేసీఆర్ సాహసోపేతంగా బస్సులో భద్రాచలానికి వెళ్లి ప్రజలకు భరోసా ఇచ్చారని, దీనిని బీజేపీ నేతలు ఓర్వలేకపోతున్నారని అన్నారు. కిషన్రెడ్డి, బండి సంజయ్ సహా బీజేపీ నేతలు ఎవరైనా ప్రజలను పరామర్శించారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రగతిపై, ప్రజల జీవితాలపై కక్షగట్టిన బీజేపీకి ఓట్లు తప్ప ప్రజల పాట్లు పట్టవని మండిపడ్డారు. బీజేపీ నేతలకు దమ్ముంటే రాష్ర్టానికి వరద సహాయంపై పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీయాలని సవాల్ చేశారు. రైస్ మిల్లుల్లో ధాన్యం మొలకలెత్తినా కేంద్రం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ధాన్యాన్ని కొనేదాకా కేంద్రాన్ని నిలదీయాలని రాష్ట్ర బీజేపీ నేతలకు సూచించారు. బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.