ఇల్లంతకుంట రూరల్, ఏప్రిల్ 6 : మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కిష్టరావుపల్లిలో నిరసన సెగ తగిలింది. గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవానికి వచ్చి వెళ్తున్న సమయంలో స్థానిక మహిళలు నిలదీయడంతో చేదు అనుభవం ఎదురైంది. ‘అయ్యా, కవ్వంపల్లి సారూ.. గ్రామపంచాయతీ ప్రారంభం చేస్తానని మా ఊరికి జోరుగానే వచ్చినవ్. కానీ, మీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అవుతున్నా మాలాంటి పేదోళ్లకు ఇస్తామన్న ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడికి పోయినయ్. మీ నాయకులు నచ్చినోళ్లకే ఇచ్చుకున్నరు’ అంటూ మండిపడ్డారు.
‘ పింఛన్లు మంజూరుకాక ఇబ్బందులు పడుతున్నాం. కొత్తవి ఇంకెప్పుడు ఇస్తారు? మహిళలకు రూ. 2,500 ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన్రు, ఇప్పటిదాకా బుడ్డపైసా ఇయ్యలే. మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తే మమ్ములను నట్టేట ముంచుతున్రు’ అంటూ ఎమ్మెల్యేపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఓబులాపూర్ నుంచి ముస్కుపల్లికి వచ్చే రోడ్డు పూర్తిగా గుంతలు ఏర్పడి వాహనాలు వెళ్లకుండా మారిందని, ఇంకెప్పుడు నిర్మిస్తారని కిష్టారావుపల్లి మాజీ సర్పంచ్ ముస్కు మల్లయ్య, గ్రామస్థులతో కలిసి ఎమ్మెల్యేను ప్రశ్నిస్తుండగా..
కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీపీ వెంకటరమణారెడ్డి మధ్యలో కలుగజేసుకుని, ‘ఐదేండ్లు నువ్వు సర్పంచ్గా ఉన్నావ్. అప్పుడేం ఏం …?’ అంటూ దుర్భాషలాడాడు. దీంతో అక్కడున్న గ్రామస్థులు.. మాజీ ఎంపీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీపీని అక్కడి నుంచి వాహనంలోకి తీసుకెళ్లగా.. ఎమ్మెల్యే కవ్వంపల్లి కూడా సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. సమస్యలపై ఎమ్మెల్యేను అడిగే స్వేచ్ఛ తమకు లేదా అని మాజీ సర్పంచ్ ముస్కు మల్లయ్య, స్థానికులు ప్రశ్నిస్తున్నారు.