హైదరాబాద్: రేవంత్రెడ్డి, బండి సంజయ్, ఎంపీ అరవింద్, మల్లన్న రాష్ట్రానికి శనిలా మారారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సీఎం కేసీఆర్ వ్యక్తిగత అంశాలు తప్ప ప్రజా సమస్యలపై మాట్లాడే దిక్కులేదని విమర్శించారు. రెండు పార్టీలు నాంపల్లి బ్రదర్స్గా మారాయని, సొరంగాలు తవ్వుకొని పొత్తులు పెట్టుకుంటున్నాయన్నారు. అసెంబ్లీ ఆవరణలోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్తో కలిసి మీడియాతో మాట్లాడారు. రేవంత్ కోతి, బండి సంజయ్ కొండెంగలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. వైద్య రంగంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయో వాళ్లకే తెలియదన్నారు. తెలంగాణ పనితనమేమిటో నీతి ఆయోగ్ ప్రపంచానికి చాటినా ప్రతిపక్షాలకు కనబడటం లేదని చెప్పారు.
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆత్మ బీజేపీ చుట్టే తిరుగుతున్నదని జీవన్రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్లో 150 ఎకరాల్లో వరి సాగుచేస్తున్నారనేది పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ వెళ్దామని రేవంత్రెడ్డి అంటే.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రానంటున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ మొదట ఇంట గెలిచి రచ్చ గెలవాలని హితవు పలికారు. ఆయన నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమం గుదిబండగా మారిందన్నారు.
బండి సంజయ్ కాస్త తొండి సంజయ్గా మారారని విమర్శించారు. రాష్ట్ర సాధనకోసం ఉద్యమనాయకుడిగా కేసీఆర్ చేసిన దీక్ష గురించి మాట్లాడితే తెలంగాణ ప్రజలను అవమానించినట్లేనని వెల్లడించారు. కేసీఆర్ దొంగ దీక్ష చేస్తే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది, మరి బీజేపీ ఎందుకు మద్దతు తెలిపిందని ప్రశ్నించారు. తరుణ్ చుగ్ వయస్సు సీఎం కేసీఆర్ రాజకీయ అనుభవమంత లేదని విమర్శించారు.