హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎల్పీ కార్యాలయంలో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. పంచాయితీ అంతా నా మధ్య, రేవంత్ రెడ్డి మధ్యనే. పార్టీలో కాదు అని జగ్గారెడ్డి తేల్చిచెప్పారు. మా ఇద్దరి గుణగణాలకు సంబంధించిన పంచాయితీ ఇది అని తెలిపారు.
రేవంత్ రెడ్డితో కలిసి పని చేసేందుకు తనకు అభ్యంతరం లేదని చాలా సార్లు చెప్పాను. ఆ కుర్చీ మీద చూసేది రేవంత్ ను కాదు.. రాహుల్ ని, సోనియాను అని అనేక సార్లు చెప్పాను. కానీ నా మీద సోషల్ మీడియాలో దుష్ర్పచారాలు చేస్తున్నారు. నేను రెండు, మూడు సార్లు కండువా మార్చుకున్నాను. కానీ శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, వీహెచ్ మీద టీఆర్ఎస్ కండువాలు కప్పి ప్రచారం చేయడం సరికాదు. నా వ్యక్తిగత ఇమేజిని డ్యామేజ్ చేస్తారు. ముత్యాలముగ్గు సినిమాలో హీరోయిన్లా తన పరిస్థితి మారిందన్నారు. రేవంత్ రెడ్డి తనకు ఝలక్ ఇవ్వడం కాదు.. తానే ఆయనకు ఝలక్ ఇస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్తో తనకెలాంటి విబేధాలు లేవు అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలా తక్కువ సమయంలోనే ఎదిగాను. నా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీతోనే సక్సెస్ అయ్యాను. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను. రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుందని చెప్పాను. అనేక సందర్భాల్లో కూడా ఈ విషయాన్ని చెప్తే.. నన్ను ద్రోహిగా పిలిచారు. పీసీసీ కావాలని తనతో పాటు చాలా మంది ప్రయత్నించారు. కానీ రేవంత్ రెడ్డికి ఆ అవకాశం వచ్చింది. జగ్గారెడ్డి ధైర్యాన్ని ప్రశ్నించే నాయకులు కాంగ్రెస్లో ఉన్నారా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. మున్ముందు రేవంత్ అసలు స్వరూపం బయట పెడుతానని జగ్గారెడ్డి పేర్కొన్నారు.