అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలతో మోసం చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఐదు హామీలంటూ మరో మోసానికి తెరలేపారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వలేదు. ఇప్పుడు ఏడాదికి లక్ష ఇస్తామంటున్నారు. ఓవర్సీస్ స్కాలర్షిప్స్ను నిలిపివేసి ప్రతి విద్యార్థికి లక్ష స్కాలర్షిప్స్ అంటూ మోసంచేస్తున్నారు. కాంగ్రెస్ హామీలు నీటిమూటలని వంద రోజుల్లో తేలిపోయింది.
-మాజీ మంత్రి జగదీశ్రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన వారిని పకనపెట్టుకుని కాంగ్రెస్ నాయకులు నీతులు చెప్తున్నారని, ఇది దేశ ప్రజలను మోసం చేయడమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి మండిపడ్డారు. రాహుల్గాంధీకి తెలివి, జ్ఞానం, చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్పై తక్షణమే అనర్హత వేటువేసి, నిజాయితీని చాటుకోవాలని సవాల్ చేశారు. ఆదివారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయిస్తారో, అనర్హతవేటు వేస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అనర్హతవేటు పిటిషన్లు స్వీకరించేందుకు స్పీకర్ సమయమివ్వడంలేదని, పిటిషన్లు తీసుకునేందుకు వెనుకడుగేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పాలన తీరు జేబుదొంగల్లా, పగటిదొంగల్లా దుర్మార్గపు పాలనలా ఉన్నదని జగదీశ్రెడ్డి మండిపడ్డారు. 2014 కంటే ముందున్న ఆరాచకాలన్నీ మళ్లీ మొదలయ్యాయని విమర్శించారు. రైతులను మిల్లర్ల దయదాక్షిణ్యాలపై వదిలేశారని ఆవేదన వ్యక్తంచేశారు. తుకుగూడ సభలో రైతుల ప్రస్తావనే లేదని మండిపడ్డారు. సీఎం, మంత్రులకు ఐపీఎల్ మ్యాచ్లు చూడటంపై ఉన్న ప్రాధాన్యం, రైతులపై లేదని ఆరోపించారు. కాంగ్రెస్ మార్పు అంటే 2014కు ముందున్న పరిస్థితి వస్తుందని ఊహించలేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలతో మోసం చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఐదు హామీలంటూ మరో మోసానికి తెరలేపారని మండిపడ్డారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని ఇవ్వలేదని, మళ్లీ ఇప్పుడు ఏడాదికి లక్ష ఇస్తామంటున్నారని మండిపడ్డారు. ఓవర్సీస్ స్కాలర్షిప్స్ను నిలిపివేసి ప్రతి విద్యార్థికి లక్ష స్కాలర్షిప్స్ అంటూ మోసంచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ హామీలు నీటమూటలని వంద రోజుల పాలనలో తేలిపోయిందని దుయ్యబట్టారు.
పదేండ్లు కష్టపడి కేసీఆర్ వ్యవసాయాన్ని నిలబెడితే, కాంగ్రెస్ నేతలు మూడు నెలల్లోనే ఆగం చేశారని జగదీశ్రెడ్డి విమర్శించారు. కేసీఆర్ రాష్ట్రంలో పర్యటిస్తుంటే కాంగ్రెస్ నాయకులకు లాగులు తడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఇన్ని రోజులు నీళ్లు లేవని అన్నారని, అప్పుడు లేవన్న నీళ్లు ఇప్పుడు ఎట్లా వచ్చినయ్? పనిచేయవన్న మోటర్లు ఎట్లా నడిచినయ్? అని ప్రశ్నించారు. కేసీఆర్ పర్యటిస్తుండటంతో నీళ్లు వదిలారని, పంటలు ఎండిన తర్వాత నీళ్లుస్తుంటే రైతులు నవ్వుకుంటున్నారని చెప్పారు. దీనికి ముఖ్యమంత్రి, ముంత్రులు సిగ్గుతో తలదించుకోవాలని పేర్కొన్నారు. నాగార్జునసాగర్లో ఇంతకంటే తకువ నీళ్లు ఉన్నప్పుడు కూడా తాము సాగుకు నీళ్లు ఇచ్చామని గుర్తుచేశారు.
మాట్లాడితే జైళ్లోపెడతాం, పేగులు మెడలో వేసుకుంటామంటూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై జగదీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రైతుల తరుపున మాట్లాడితే, సాగు, తాగునీరు ఇవ్వాలని అడిగితే జైళ్లో పెడతారా? కేసీఆర్ ఏనాడైనా ఇలా బెదిరించారా? కేసీఆర్ను జైళ్లో పెట్టేందుకు రేవంత్రెడ్డి ఎవరు? ప్రభుత్వంలో వీళ్లు మంత్రులా? లేక పోలీసులా?’ అని ప్రశ్నించారు. కరెంటు మంత్రికి కరెంట్ ఇచ్చే, నీళ్ల మంత్రికి నీళ్లిచ్చే సోయిలేదని మండిపడ్డారు. జైళ్లకు భయపడటానికి కేసీఆర్.. రాహుల్గాంధీ కాదని జగదీశ్రెడ్డి చురకలేశారు.
వంద రోజుల్లో కాంగ్రెస్ పాలకులు రాష్ట్రంలో వసూళ్లు చేసి ఢిల్లీకి కప్పం కడుతున్నారని జగదీశ్రెడ్డి విమర్శించారు. మిల్లర్లు, క్రషర్ యజమానులు, కాంట్రాక్టర్ల దగ్గర వసూళ్లు చేస్తున్నారని, కష్టపడటమంటే ఇదేనా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక ఉన్న ధర పోయిందని రైతులు బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఎండిన పంటలకు తక్షణమే ఎకరానికి రూ.25 వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అన్ని పంటలకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని, రైతులకు వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని, వెంటనే అందరికీ రైతుబంధు అందించాలని డిమాండ్ చేశారు. రైతుల జోలికి వెళ్లొద్దని బ్యాంకులకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం హామీలను అమలుచేయకుంటే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశ్ర్, పార్టీ నేత నర్సింహారెడ్డి పాల్గొన్నారు.