సూర్యాపేట : ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం, ఆరోగ్య సందేశాన్ని కార్తీక వనభోజనాలు మనకు చాటిచెబుతాయని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagdish Reddy) అన్నారు. నియోజకవర్గంలోని ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్లో సంతోషి మాతా రూపాదేవి ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన( Vanamaradana) మహోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే లింగాలతో మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. శివలింగాలకు భక్తులు క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దేశసంస్కృతి, సంప్రదాయాలను అనుసరించి అనాదిగా వస్తున్న ఎన్నో పర్వదినాలను మనం పాటిస్తూ వస్తున్నామని తెలిపారు. ఇందులో భాగమే కార్తీక మాసంలో జరుపుకునే వన సమారాధన కార్యక్రమం అన్నారు . భారతీయ ఆయుర్వేదంలో వృక్ష జాతికి ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు.
అలాగే కార్తీక వనసమరాధన కేవలం భోజనాలకే పరిమితం కాకుండా ఆటలు, పాటలు కబుర్లకు ఇది చక్కటి వేదిక అన్నారు. పిల్లలు, పెద్దలలో ఉన్న సృజనాత్మకతను తట్టిలేపే క్రీడలు, నృత్యాలు, సంగీత కచేరీలు నిర్వహించడానికి మంచి అవకాశం ఉందన్నారు. మానవ మనుగడకు వనాలు చేసే మేలు అంతా ఇంతా కాదన్నారు. భవిష్యత్ తరాలకు కూడా మేలు చేకూర్చే వృక్షజాతిని సంరక్షించాలనే నిగూఢ సందేశాన్ని వనసమారాధన అందిస్తున్నదని తెలిపారు.