హైదరాబాద్, జూన్ 28 : సీఎం రేవంత్రెడ్డి నల్లగొండ పర్యటన సందర్భంగా యథావిధిగా జిల్లా ప్రజలు ఊహించినట్టుగానే తన వికారాన్ని వాంతి చేసుకున్నాడని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఆదివారం రాత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోసారి తన సంస్కారహీనతను బయటపెట్టుకున్నాడని విమర్శించారు. నల్లగొండ జిల్లాకు కేసీఆర్ ఏం చేశారని అడిగితే మూడు నిమిషాల్లో 300 పనులు చెప్పొచ్చని తెలిపారు. రేవంత్కు 30 గంటలు కాదు 30 రోజుల సమయం ఇచ్చినా జిల్లాకు చేసిన మేలు ఒక్కటీ చెప్పలేడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిసారీ ప్రజలకు ఏదో ఒక మేలు జరిగిందని, రేవంత్ వస్తే మాత్రం ఉన్న మూసీ కంపునకు అదనంగా నోటి కంపు తోడవడం తప్పితే జిల్లాకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కేసీఆర్ వస్తే నిధుల ప్రవాహం ఉండేదని, రేవంత్ మాత్రం బూతుల ప్రవాహం తప్ప ఏమీ లేదని దుయ్యబట్టారు.