కామారెడ్డి: బీసీ కుల, చేతి వృత్తుల కుటుంబాలలో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, కామారెడ్డి శాసనసభ్యుడు గంప గోవర్ధన్ ( Mla Gampa Govardhan) అన్నారు. బుధవారం కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన 300 మంది బీసీ లబ్దిదారులకు ( BC beneficiaries ) లక్ష రూపాయల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల వృత్తులను కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR ) అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారని అన్నారు. మత్స్యకారులకు వందశాతం రాయితీపై చేప పిల్లల పంపిణీ, వాటి విక్రయానికి వాహనాలు అందజేశారని తెలిపారు. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి చేపలను దిగుమతి చేసుకునేవారమని, ఇప్పుడు తెలంగాణ నుంచే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన బీసీ కుల, చేతి వృత్తిదారులకు ఎలాంటి పూచికత్తు లేకుండా పూర్తిగా ఉచితంగా ఇస్తున్న లక్ష రూపాయల ఆర్ధిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు. ప్రతి నెలా నియోజక వర్గం వారీగా 300 మంది చొప్పున లబ్దిదారులకు ఆర్ధిక సహాయం అందజేస్తామని అన్నారు. త్వరలో మైనారిటీ వర్గాలకు లక్ష సహాయం అందించనున్నామని తెలిపారు.
మహిళలకు కుట్టు మిషన్లు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలద్వారా రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని, బీహార్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం రాష్ట్రానికి వస్తున్నారని అన్నారు. అంతకుముందు జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబొద్దీన్, జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ రావు, మునిసిపల్ వైస్ చైర్పర్సన్ ఇందు ప్రియ, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.