మిర్యాలగూడ, ఫిబ్రవరి 5: చంద్రబాబు బూట్లు నాకే కాంగ్రెస్ నేతల అసమర్థత కారణంగానే కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పాల్సిన దుస్థితి వచ్చిందని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్ నీళ్ల కోసం కేసీఆర్ పోరాటం చేస్తారని, కాంగ్రెస్ నాయకులను ఉరికించి కొడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు దద్దమ్మలని, కేసీఆర్ వస్తుండనగానే వాళ్ల లాగులు తడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఆ అక్కసుతోనే సీఎం రేవంత్రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మాజీ మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, జగదీశ్రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఇవ్వడం అంటే ఆంధ్రాకు అప్పనంగా నీటిని రాసివ్వడమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ చేతికానితనం వల్ల సాగర్ డ్యామ్ మన చేతుల్లో నుంచి వెళ్లిపోయిందని చెప్పారు. సాగర్ ఎడమ కాల్వ రైతాంగం మళ్లీ తిరోగమనం అయ్యే పరిస్థితి వచ్చిందని, సాగర్ డ్యామ్ కేంద్ర బలగాల చేతుల్లోకి పోయిందని, మనం అక్కడ అడుగు పెట్టే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. ఇక యుద్ధం మొదలు పెట్టాల్సిందేనని, కాంగ్రెస్ను తరిమికొట్టాల్సిందేనని బీఆర్ఎస్ నాయకులకు పిలుపునిచ్చారు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టండని మంత్రి కోమటిరెడ్డి అనడం ఆయన అహంకారానికి నిదర్శనమని దుయ్యబట్టారు. యాదాద్రి పవర్ప్లాంట్ ప్రాజెక్టు పనులను ఆపితే మంత్రి కోమటిరెడ్డిని ప్రజలే చెప్పులతో కొడ్తారని హెచ్చరించారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ చేపట్టిన జోడోయాత్ర చోడోయాత్రగా మారిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఎద్దేవా చేశారు. ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఇండియా కూటమి పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ముక్కలైందని ఎద్దేవా చేశారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్కు 40-50 ఎంపీ స్థానాలు రావడం కూడా గగనమేనని వ్యాఖ్యానించారని, దీనిని బట్టి ఆ పార్టీ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చని అన్నారు. కాంగ్రెస్ ధోరణి నచ్చకనే కూటమిలో భాగస్వాములైన కేజ్రీవాల్, నితీశ్కుమార్, మమతాబెనర్జీ వంటి కీలక నేతలు విడిపోయారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీది నడమంత్రపు సంసారమేనని, ముందుకు సాగేది కాదని పేర్కొన్నారు. 2014 తరువాత ఆ పార్టీ ఏ రాష్ట్రంలోనూ రెండోసారి అధికారంలోకి రాలేదని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, గుత్తా అమిత్రెడ్డి, అలుగుబెల్లి అమరేందర్రెడ్డి, తిరునగరు భార్గవ్ పాల్గొన్నారు.