రాజన్న సిరిసిల్ల : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వేములవాడ రాజన్న దర్శనం కోసం వచ్చి రాజకీయాలు మాట్లాడడం సరికాదు. రాజకీయాలు కాకుండా దుబ్బాక ప్రజల కోసం మొక్కితే బాగుండేదని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ అన్నారు.
వేములవాడ పట్టణంలోనీ సంగీత నిలయంలో ఎమ్మెల్యే చెన్నమనేని మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రఘునందన్ రావు మాటలు వింటుంటే బాధ అనిపిస్తుందన్నారు. మంత్రి కేటీఆర్ చాలా సార్లు కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నారు. కానీ అతడిని నాస్తికుడు అనడం బావ్యం కాదన్నారు.
దేశంలో దేవుడిని ఎప్పుడు దర్శనం చేసుకోవాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనేది పౌరల హక్కుకు సంబంధించిన విషయం అన్నారు. బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ కోసం నిధులు వెచ్చించాం. మీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి అయిన రాజన్న ఆలయానికి తీసుకువచ్చారా అని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థలను అమ్ముతూ కేంద్రం కాలం వెళ్లదీస్తున్నదని మండిపడ్డారు.
బీజేపీ ప్రజల మనసుల్లో విద్వేషాలు సృష్టించాలనకుంటున్నదని ఆరోపించారు. దేవాలయంలో రాజకీయాలు చేయడం మీకు ఉండచ్చు. కానీ మాకు అలాంటి సంప్రదాయం లేదన్నారు. వేములవాడకు ఉప ఎన్నిక వస్తదని రఘనందన్ రావు అంటున్నారు. 4 సార్లు బీజేపీ అభ్యర్థిని చిత్తుగా ఓడించిన విషయం మర్చిపోవద్దన్నారు.
మంత్రి కేటీఆర్ నాయకత్వంలో జిల్లా అభివృద్ధి వేగంగా జరుగుతుందని ఎమ్మెల్యే చెన్నమనేని తెలిపారు. సీఎం కేసీఆర్ సచివాలయానికి డా.బి.ఆర్. అంబేడ్కర్ పేరు పెట్టడం హర్షణీయం అన్నారు.
రఘు నందన్ రావుకు నిజాయితీ ఉంటే కేటీఆర్పై, నా పై మాట్లాడిన మాటలు వెనక్కు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, జిల్లా టీఅర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య, తదితరులు ఉన్నారు.