నల్లగొండ : మరోసారి ఆశీర్వదించండి నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్(MLA Bhagat) అన్నారు. గురువారం హాలియా క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవతున్నాయి.
రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు వంటి పథకాలను దేశానికి పరిచయం చేసిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే మూడోసారి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయన్నారు. జానారెడ్డి ఏడుసార్లు ఎమ్మెల్యేగా, 16 సంవత్సరాల మంత్రిగా పనిచేసినప్పటికి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదన్నారు.
రెండున్నర సంవత్సరాల్లో తాను అధిక నిధులు తీసుకొచ్చి నాగార్జునసాగర్ అభివృద్ధికి కృషి చేశానని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను నియోజకవర్గంలో ప్రతి ఇంటికి అందజేయాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రామచంద్ర నాయక్, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.