హైదరాబాద్ : డ్రగ్స్, గంజాయి మత్తులో ఊగుతున్నది జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నాయకుల పిల్లలే అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే కేపీ వివేకానందతో కలిసి బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్లోని ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్లో పట్టుబడిన పిల్లలంతా బీజేపీ, కాంగ్రెస్ నాయకుల పిల్లలే అని సుమన్ తెలిపారు. అక్కడ డ్రగ్స్ వినియోగం జరుగుతందని పోలీసులకు సమాచారం అందడంతో చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. దాంతో ఆ పబ్ నిర్వాహకులు బీజేపీ నాయకురాలు ఉప్పల శారద కుమారుడు అభిషేక్ ఉప్పల అని తేలిందన్నారు. ఉప్పల శారద 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేశారని సుమన్ గుర్తు చేశారు. అభిషేక్ బీజేపీ కండువా కప్పుకొని ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారని తెలిపిన సుమన్.. అందుకు సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు.
ఈ పబ్ కేసులో రేవంత్ రెడ్డి మేనల్లుడి పేరు కూడా ఉందని సుమన్ పేర్కొన్నారు. పోలీసులు విడుదల చేసిన జాబితాలో 24వ పేరు సూదిని ప్రణయ్ రెడ్డి(రేవంత్ మేనల్లుడు)ది ఉంది. ఈయన కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్ కూడా అని తెలిపారు. దీంతో ఈ రెండు జాతీయ పార్టీలకు సంబంధించిన నాయకుల పిల్లలు పాల్గొన్నట్లు క్లియర్గా తెలుస్తోందన్నారు.
రాష్ట్రంలో డ్రగ్స్ విషయం వచ్చేసరికి కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎగిరెగిరి మాట్లాడుతారు. షూట్ చేయాలి, ఉరి తీయాలని మాట్లాడుతారు. మరి ఇవాళ ఎవర్నీ ఉరి తీయాల్నో, ఎవర్నీ షూట్ చేయాల్నో.. సైకో సంజయ్, రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలను మీడియా ముందు పెడుతున్నాం. కాంగ్రెస్, బీజేపీ నాయకుల పిల్లల్లోనే డ్రగ్స్ విచ్చలవిడితనం ఉందని నిన్నటి ఘటనతో రుజువైందన్నారు. ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి. లేదంటే తగినరీతిలో బుద్ధి చెప్తారని బాల్క సుమన్ హెచ్చరించారు.
డ్రగ్స్, గంజాయి మత్తులో ఊగుతున్నది జాతీయ పార్టీల నాయకుల పిల్లలే అని సుమన్ స్పష్టం చేశారు. నీతులు సమాజానికి చెప్పడం కాదు.. మీ పిల్లలకు, బంధువులకు చెప్పుకోవాలని ప్రతిపక్ష పార్టీల నేతలకు ఆయన సూచించారు. ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్లో ముంచుతున్నది.. కేవలం బీజేపీ, కాంగ్రెస్ నాయకులే. ఈ కేసులో ఎవర్నీ వదిలిపెట్టొద్దని పోలీసులను కోరుతున్నాను. తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాల్సిందే. డ్రగ్స్ నిందితులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ తరపున డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ సీవీ ఆనంద్ను కోరుతున్నాను. సమాజాన్ని పట్టిపీడిస్తోన్న అంశాల పట్ల కేసీఆర్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని బాల్క సుమన్ తేల్చిచెప్పారు.