Guvvala Balaraju | పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర మంతా తిరిగేది భూ కబ్జాల కోసమేనా అని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ప్రశ్నించారు. వీరిద్దరి మాటలకు అడ్డూ అదుపూ లేకుండా పోయాయని మండిపడ్డారు. మరోవైపు, రేవంత్రెడ్డి తనపై చేసిన భూఅక్రమణలు నిరూపిస్తే చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తానని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు స్పష్టం చేశారు. గురువారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులపై నిప్పులు చెరిగారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఏ మంచిపనిచేసినా బండి సంజయ్ అడ్డుపడుతున్నారని గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్పై నోటికొచ్చినట్టు మాట్లాడితే వార్తల్లో ఉండొచ్చనే కుత్సిత బుద్ధితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచమే అబ్బురపడే రీతిలో సీఎం కేసీఆర్ యాదాద్రిని పునర్నిర్మాణం మొదలుపెట్టినప్పుడు ఎలాంటి కూతలు కూశారో.. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కార్యాచరణ ప్రకటిస్తే కూడా అలాంటి కూతలే కూశారన్నారు. అలాంటి పవిత్ర కార్యాన్ని కూడా కేసీఆర్ బంధువుల కోసమే అని బండి సంజయ్ నీచంగా వ్యాఖ్యానించటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయటం, అందుకోసం నోటిఫికేషన్లు జారీ చేయటం బీజేపీ నాయకులకు రుచించటం లేదని గువ్వల బాలరాజు అన్నారు. బీఆర్ అంబేద్కర్ పేరుతో నిర్మిస్తున్న రాష్ట్ర సచివాలయాన్ని కూల్చివేస్తామన్న బండిని, బీజేపీని ప్రజలు పాతాళానికి తొక్కేస్తారని హెచ్చరించారు. అబద్దాల పునాదులపై అధికారంలోకి రావాలని బీజేపీ, కాంగ్రెస్ కలలుకంటున్నాయని, అందుకే ఒకరు కూల్చివేస్తామని, మరొకరు పేల్చేస్తామని పిచ్చికూతలు కూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లిద్దరూ ఉండాల్సింది పిచ్చాస్పత్రుల్లోనని, ఈ విషయంలో వారివారి పార్టీల నేతలు ప్రత్యేక చొరవ చూపాలని ఆయన సూచించారు. దేశం అంతా తెలంగాణ మాడల్ కావాలని కోరుకుంటున్న ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంపై దేశం ఆలోచిస్తున్నదని గువ్వల బాలరాజు చెప్పారు. ఓడిపోయే పార్టీలే పొత్తుల గురించి మాట్లాడతాయని, బీఆర్ఎస్ పార్టీకి ఎవరితోనూ పొత్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆయనన్నారు.
ఒక్కటి నిరూపించినా పోటీచేయను: విప్ రేగా కాంతారావు
తాను 300 ఎకరాలు అక్రమంగా సంపాదించానని నిరూపిస్తే మణుగూరు చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తానని, లేదంటే రేవంత్రెడ్డి ఆ పని చేసేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సవాల్ విసిరారు. రేవంత్ తనపై విడుదల చేసిన ఛార్జిషీట్లో పేర్కొన్న ఏ ఒక్కదాన్ని నిరూపించానా తాను వచ్చే ఎన్నికల్లో పోటీచేయనని తేల్చిచెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ఇద్దరు తిట్ల పురాణంలో పోటీ పడుతున్నారని విమర్శించారు. తిట్లతో అధికారం రాలేమనే విషయాన్ని తెలుసుకుంటే మంచిదని సెలవిచ్చారు. రేవంత్రెడ్డి తన కులాన్ని, జాతిని అవమానించారని చెప్పారు. రేవంత్ గాలి మాటలు బంద్ చేయాలని, లేదంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తాము తలచుకుంటే రేవంత్ తన నియోజకవర్గంలోనే పాదయాత్ర చేసేవాడే కాదన్నారు.