హైదరాబాద్ : మియాపూర్లో జరిగిన ప్రమోన్మాది దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి తల్లి శోభ బుధవారం ఉదయం మృతి చెందింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. మియాపూర్ సీఐ తిరుపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.
బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన ఓ యువతి (19) తన తల్లి, సోదరుడితో కలిసి హఫీజ్పేట ఆదిత్యనగర్లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో యువతిని సందీప్ అనే యువకుడు గత కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో వేధించసాగాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ యువతి వెంట పడేవాడు. ఇందుకు యువతి నిరాకరించింది. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం యువతి ఇంటికి వెళ్లిన సందీప్ తనను పెళ్లి చేసుకోవాలంటూ వాదనకు దిగాడు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న కత్తితో యువతిపై దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఆమె తల్లిపైనా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం తాను గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి తల్లిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శోభ బుధవారం మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.