చిన్నగూడూరు, డిసెంబర్ 18: గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరు తూ ఓ వ్యక్తి అధికారులు, సర్పంచ్ కాళ్లపై పడి వేడుకున్నారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు గ్రామం లో శనివారం గ్రామసభకు ఏర్పాట్లు చేశారు. అధికారులు ఎవరూ హాజరుకాకపోవడంతో సర్పంచ్ కొమ్ము మల్లయ్య, కార్యదర్శి అజీమ్ సభను వాయిదా వేసి వెళ్తుండగా.. ఊరిని అభివృద్ధి చేయాలని వేడుకుంటూ గ్రామస్థుడు విద్యాసాగర్ వారి కాళ్లపై పడ్డారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తున్నా పంచాయతీ పాలకవర్గం, స్థానిక అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నట్టు ఆరోపించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి నీరుగారిపోతుందన్నారు. గ్రామంలో నిధులు దుర్వినియోగం చేస్తున్నారని, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.