ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేండ్లలోనే పూర్తి చేసి, 200 కిలోమీటర్ల మేర గోదావరి నదిని సజీవ జలధారగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ది. ఆ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ మరో అద్భుతం. డాక్టర్ రాజేంద్రసింగ్ సూచనల మేరకు మూసీ నదిని రాబోయే మూడేండ్లలో పునరుద్ధరిస్తాం. సీఎం కేసీఆర్ అందుకు ఇప్పటికే ప్రణాళికను రూపొందించారు. మూసీ నదిని గోదావరి జలాలతో నింపుతాం. ఆ నదీ తీరంలో రాజేంద్రసింగ్ జన్మదిన వేడుకలు నిర్వహిస్తాం. – ఆర్థిక మంత్రి హరీశ్రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 27 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం అనుకొన్న ఫలితమిస్తున్నదని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. నదుల పునరుజ్జీవం, పరిరక్షణకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విశేష కృషి చేస్తున్నారని, నదులపై ప్రత్యేక దృష్టి సారించి అనేక చర్యలు చేపడుతున్నారని కొనియాడారు. హైదరాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న నదుల పునరుజ్జీవ జాతీయ సదస్సు శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి హరీశ్రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. చెరువుల పునరుద్ధరణకు మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టి.. ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో దాన్ని ఉద్యమం తరహాలో ముందుకు తీసుకుపోయారని వెల్లడించారు. ఆ పథకాన్ని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్రసింగ్ సైతం ప్రశంసించారని, నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండ చెరువుపై తన పుట్టినరోజు వేడుకలను సంతోషంగా జరుపుకొన్నారని గుర్తుచేశారు. నదుల పునరుద్ధరణ, పరిరక్షణ కోసం సీఎం కేసీఆర్ అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని, నిధులకు వెనుకంజ వేయకుండా ప్రాజెక్టులను, రిజర్వాయర్లను స్వల్ప కాలంలోనే నిర్మిస్తున్నారని వివరించారు. నీటి సంరక్షణకు ప్రభుత్వం చేపట్టిన పనుల ఫలాలను తెలంగాణ రాష్ట్రం తిరిగి అందుకొంటున్నదని తెలిపారు. కుండపోత వర్షాలు కురిసినా ఏ ఒక్క చెరువు తెగిపోవటం లేదని, గత ఏడేండ్లలో 4 మీటర్ల మేరకు భూగర్భ జలాలు పెరిగాయని ఉదహరించారు. పాడి పంటలు జాతీయ సగటును మించి ఎన్నో రెట్లు వృద్ధి చెందాయని వెల్లడించారు. తలసరి ఆదాయంలో తెలంగాణ రూ. 1,24,104 నుంచి రూ.2,78,933కు చేరుకొన్నదని, జీడీపీ సైతం రూ.5.5 లక్షల కోట్ల నుంచి రూ.11.54 లక్షల కోట్లకు పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు.
కేంద్ర జల విధానాలపై ధ్వజం
కేంద్రం అనుసరిస్తున్న జలవిధానాలు ఏవీ సరిగా లేవని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. మోదీ సర్కారు కేంద్రీకృత విధానాలను అవలంబిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణానికి కావాల్సిన అనుమతుల కోసం ఏండ్ల సమయం పడుతున్నదని ఆరోపించారు. ఆ విధానాలన్నింటినీ మార్చాల్సిన అవసరమున్నదని నొక్కిచెప్పారు. అదేవిధంగా, నదుల పునరుద్ధరణకు నడుం కట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం సమ్మేళనంలో పాల్గొన్న అందరితో నీటి ప్రతిజ్ఞ చేయించారు.
నీటిసంరక్షణలో తెలంగాణే ఆదర్శం: జగదీశ్రెడ్డి
నీటి వనరుల సంరక్షణ, సద్వినియోగంలో దేశానికి తెలంగాణ ఆదర్శమని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో అనేక సమస్యలను అధిగమించామని తెలిపారు. గత ఏడేండ్లలో నల్లగొండ జిల్లాల్లో ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాకపోవడమే అందుకు నిదర్శనమని ఉదహరించారు. నీటి వనరుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు.
నీటి వనరులతోనే అభివృద్ధి: పల్లా రాజేశ్వర్రెడ్డి
నీటి వనరుల వృద్ధితోనే సమాజ ప్రగతి ముడిపడి ఉంటుందని సమ్మేళనంలో పాల్గొన్న రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. అందుకు తెలంగాణే నిదర్శనమని చెప్పారు. గత ఏడేండ్లలో వ్యవసాయరంగంలో సాధించిన ప్రగతిని ఉదహరించారు. ప్రతి ఒక్కరూ నీటివనరుల సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
నీటి సంరక్షకులకు అవార్డులు
నీటి సంరక్షణకు పాటుపడుతున్న వివిధ స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు, అధికారులు, పరిశ్రమలకు మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. జల ఉద్యమకారుడు దుశ్చర్ల సత్యనారాయణ, పురాతన మెట్ల బావుల పునరుద్ధరణకు విశేష కృషి చేస్తున్న నారాయణపేట కలెక్టర్ హరిచందన, ఉత్తమ ప్రభుత్వ సంస్థల విభాగంలో హైదరాబాద్ మెట్రో వాట ర్ వర్క్స్, కాకతీయ యూనివర్సిటీ, సీఎస్సార్ కింద నిధులను వెచ్చిస్తున్న ఉత్తమ సంస్థల విభాగంలో సింగరేణి, మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్తోపాటు ఉత్తమ మీడియా సంస్థల విభాగంలో నమస్తే తె లంగాణ, టీ న్యూస్, ఈటీవీ, ఈనాడు పత్రికలతో పాటు మొత్తం 40 మందికి అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో కర్ణాటక మైనర్ ఇరిగేషన్, భూగర్భజల వనరులశాఖ మంత్రి మధుస్వామి, తెలంగాణ సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, కృష్ణా రివర్ ఫ్యామిలీ చైర్మన్ శ్యాంప్రసాద్రెడ్డి, ఐఈఐ చైర్మన్ రమణానాయక్, ఇతర రాష్ర్టాల ప్రతినిధులు గురుమూర్తి, సత్యనారాయణ, రా జు, అదితి, స్నేహాల్ దౌండే, వనితామోహన్, ప్రశాంత్ చౌదరి బిక్కసాని, సోని తదితరులు పాల్గొన్నారు.
నదుల పరిరక్షణకు విశేష కృషి
‘నమస్తే తెలంగాణ’కు ఉత్తమ మీడియా అవార్డు
నీటి సంరక్షణ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లటం, ఆ దిశగా ప్రజలను చైతన్యవంతులను చేసే కథనాలు ప్రచురిస్తున్న ‘నమస్తే తెలంగాణ’కు నదుల పునరుజ్జీవ జాతీయ సదస్సు ప్రతినిధులు ఉత్తమ మీడియా అవార్డును అందజేశారు. నీటి ఆవశ్యకతను వివరించడంతోపాటు, నీటి సంరక్షణకు కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థల సేవలకు పత్రిక ప్రాచుర్యం కల్పిస్తున్నదని ప్రశంసలు కురిపించారు. నదుల పునరుజ్జీవంలో ప్రజలు భాగస్వాములయ్యేలా కృషి చేస్తున్నదని అభినందించారు.