వరంగల్, జనవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొత్త రాష్ట్రమైనా తెలంగాణ బాగా అభివృద్ధి చెందిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. అందరికీ తాగునీరు అందించే మిషన్ భగీరథ పథకం అద్భుతమని కితాబిచ్చారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాసర్తో కలిసి బాపిరాజు కుటుంబ సభ్యులు శుక్రవారం భద్రకాళి అమ్మవారిని, వేయిస్తంభాల ఆలయాన్ని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం బాపిరాజు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో విస్తరిస్తుందని చెప్పారు.
తెలంగాణ బాగా అభివృద్ధి చెందుతున్నదని, అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందని అన్నారు. గతంలో ఇక్కడ తాగునీటి కోసం జనం బాగా ఇబ్బంది పడేవారని, 33 ఏండ్ల క్రితం తాగునీటి కోసం రూ.వెయ్యి కోట్లతో పనులు చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ప్రభుత్వం మారిపోవడంతో అది ఆగిపోయినట్టు ఆయన తెలిపారు. ఇంటింటికీ నీరు అందించాలనేది మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయ్ కల అని, తాను ఎంపీగా ఉన్నప్పుడు ఆయన పార్లమెంటులో ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే ఆ కలను తెలంగాణ సీఎం కేసీఆర్ నెరవేర్చారని కొనియాడారు. మిషన్ భగీరథ పథకం అద్భుతమని ప్రశంసించారు.
వరంగల్ ఉమ్మడి జిల్లా చెరువులకు ప్రసిద్ధి అని, ఇక్కడి చెరువులను బాగు చేయాలని అప్పట్లో తాను ప్రతిపాదించినట్టు చెప్పారు. అయితే తెలంగాణలో మిషన్ కాకతీయ పేరుతో దాన్ని పూర్తి చేశారని తెలిపారు. 1992లో వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా పనిచేశానని, సమ్మక-సారలమ్మ జాతరకు రోడ్డు వేసే భాగ్యం తనకు కలిగిందని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ డిమాండ్కు సరిపడా కరెంటు సరఫరా అయ్యేది కాదని, తాను ఇన్చార్జిగా ఉన్నప్పుడు లోఓల్టేజీ సమస్య పరిష్కారం కోసం ప్రత్యేకంగా పనులు చేయించినట్టు చెప్పారు.