గజ్వేల్, జూలై 5: మిషన్ భగీరథ వండర్ఫుల్ అని నాగాలాండ్ సివిల్ సర్వీసెస్ అధికారుల బృందం కితాబునిచ్చింది. డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఏడు రోజుల శిక్షణ లో భాగంగా ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ హరిప్రీత్సింగ్ ఆదేశాల మేరకు నాగాలాండ్కు చెందిన 17 మంది సివిల్ సర్వీసెస్ అధికారులు కోర్సు డైరెక్టర్లు మాధవి, శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండలోని మిషన్ భగీరథ సంప్హౌస్ను సందర్శించారు. మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ విజయ్ప్రకాశ్, ఈఈ రాజయ్య, డీఈఈ నాగార్జునరావు పథకం గురించి అధికారుల బృందానికి వివరించారు. నీటి సేకరణ, ఉద్దేశం, నీటి శుద్ధీకరణ, ఇంటింటికీ సరఫరా విధానం తదితర అంశాల గురించి అవగాహన కల్పించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు అద్భుతమని నాగాలాండ్ అధికారులు ప్రశంసించారు. ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించడానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషి ఈ ప్రాజెక్టును చూసి తెలుసుకోవచ్చన్నారు. భవిష్యత్తులో తమ ప్రాంతంలోనూ ఇలాంటి పథకాన్ని అమలు చేస్తామని బృందం సభ్యులు పేర్కొన్నారు.