మంచిర్యాల ఏసీసీ, జనవరి 19 : ఇటీవల మంచిర్యాల జిల్లా చెన్నూర్ డివిజన్లో ఆడ పులి తిరుగుతున్నట్టు అధికారులు గుర్తించగా, ప్రస్తుతం అది కనిపించకుండా పోవడంతో గాలిస్తున్నారు. చెన్నూర్ డివిజన్లోని నీల్వాయి, కృష్ణపల్లి, కోటపల్లి, నెన్నెల అటవీ ప్రాంతాల్లో తిరుగుతున్న కే-12 ఆడ పులి నెల రోజుల క్రితం అదృశ్యమైంది. 15 రోజులుగా అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అడవిని జల్లెడ పడుతున్నారు. చివరిసారిగా కొత్తూర్ ప్రాంతంలోని వాగు నుంచి వెళ్లినట్టు దాని పాద ముద్రల ఆధారంగా గుర్తించారు. కనిపించకుండా పోయిన పులి దారి తప్పిందా? లేక ఏదైనా ప్రమాదానికి గురైందా? అని అధికారులు ఆందోళన చెందుతున్నారు. అటవీ ప్రాంతంలో పదుల సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి 150 మంది ్రైస్టెకింగ్ ఫోర్స్, యానిమల్ ట్రాక్, బేస్ క్యాంప్ సిబ్బందితో గాలింపు చర్యలు చేపడుతున్నారు.