కరీంనగర్ : జూలై 27న అదృశ్యమైన మూడేళ్ల బాలిక కృతిక ఉదంతం విషాదంగా ముగిసింది. చిన్నారి మృతదేహం గురువారం కరీంనగర్ పట్టణం, లక్ష్మీనగర్లోని డ్రైనేజీలో లభ్యమైంది. స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జిల్లా ప్రధాన దవాఖాన మార్చురీకి తరలించారు. కాగా, జూలై 27న కనిపించకుండా పోయిన కృతిక తన ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయింది.
ఆమె కోసం వెతికిన తల్లిదండ్రులు సోమవారం కరీంనగర్ టౌన్-2 పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పాప డ్రైనేజీలో పడి కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్కు చెందిన చిన్నారి తల్లిదండ్రులు యశ్వంత్, సవిత కార్వే భవన నిర్మాణ కూలీలుగా కరీంనగర్కు వలస వచ్చి ఇక్కడి హరిహరనగర్లో నివాసం ఉంటున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.