హైదరాబాద్ : రాష్ట్రానికి జవాద్ తుఫాను ముప్పు తప్పింది. జవాద్ తుఫాన్ ఉత్తారాంధ్ర, దక్షిణ ఒడిశా, పశ్చిమబెంగాల్ వైపు వెళ్లే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం లేదని స్పష్టం చేశారు. తుఫాను కారణంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు కాస్త పెరుగుతాయని పేర్కొన్నారు. ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పారు.
ఉత్తర ఈశాన్య దిశగా జవాద్ తుఫాన్ వెళ్లనుందని, థాయిలాండ్ పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల కిందట ఏర్పడిన అల్పపీడనం గురువారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా మారి ఆగ్నేయ బంగాళాఖాతం పక్కనే ఉన్న అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం మధ్యస్థ ట్రోపోస్పియర్ స్థాయి వరకు వ్యాపించి ఉందని పేర్కొన్నది.
తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్యదిశగా కదిలి శుక్రవారం ఉదయంలోగా అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత 24 గంటల్లో తుఫానుగా మారి శనివారం ఉదయానికి ఉత్తరాంధ్ర- ఒడిశా తీరానికి చేరుకొని, ఉత్తర ఈశాన్య దిశగా వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నది. ఈ తుఫాన్ ఉత్తర ఈశాన్యదిశగా వెళ్లే అవకాశం ఉండడంతో తెలంగాణకు తుఫాన్ ప్రభావం ఉండదని స్పష్టం చేశారు.
కాగా, తూర్పు దిశ గాలుల తెలంగాణ రాష్ట్రంలోకి వీస్తున్నాయని తెలిపింది. దీంతో గురువారం రాత్రి ఉష్ణోగ్రతలు 12.7 నుంచి 19.5 డిగ్రీల సెల్సీయస్, పగటి ఉష్ణోగ్రతలు 31.2 నుంచి 34. 5 డిగ్రీల సెల్సీయస్ మధ్యనమోదైనట్లు టీఎస్డీపీఎస్ తెలిపింది. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలతో పాటు దక్షిణ ఒడిశాకు జవాద్ ముప్పు పొంచి ఉండడంతో దక్షిణ మధ్య రైల్వే అటువైపు వెళ్లే రైళ్లను 3, 4 తేదీల్లో రద్దు చేసింది.