నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
చర్యలు తీసుకోండి: కొప్పుల
మైనారిటీ గురుకులాల్లో 1,445, సంక్షేమ శాఖలో 76 పోస్టులు
టీఆర్ఈఐబీ ద్వారా భర్తీకి చర్యలు
హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున మొత్తంగా 33 మైనారిటీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇస్తామని మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఆ దిశగా వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో మైనారిటీ శాఖ అధికారులతో కొప్పుల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగార్థులకు అత్యుత్తమ కోచింగ్ ఇప్పించేందుకు విధివిధానాలు రూపొందించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
గ్రూప్ 1, 2, 3 పోస్టుల కోసం ఉమ్మడి జిల్లాల్లోని మైనారిటీ స్టడీ సెంటర్లలో, గ్రూప్ 4 పోస్టులకు 33 జిల్లా కేంద్రాలలో కోచింగ్ ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. రంజాన్ తర్వాత కోచింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అటు.. మైనారిటీ సంక్షేమ శాఖలో 76 పోస్టులు, మైనారిటీ గురుకుల విద్యాసంస్థల సొసైటీలో 1,445 ఖాళీలు ఉన్నాయని మంత్రికి అధికారులు వివరించారు. వాటిని తెలంగాణ గురుకుల విద్యాసంస్థ మండలి (టీఆర్ఈఐబీ) ద్వారా భర్తీ చేయనున్నట్టు తెలిపారు. సమావేశంలో మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్, మైనారిటీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి నదీం అహ్మద్, డైరెక్టర్ షానవాజ్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.
ఖాళీ పోస్టులు:
మైనారిటీ సంక్షేమాధికారి : 6
సహాయ సంక్షేమాధికారి : 10
హౌస్ సంక్షేమాధికారి : 15
జూనియర్ అసిస్టెంట్లు : 28
అకౌంటెంట్లు : 4
ఉర్దూ ఆఫీసర్లు : 13
గరుకులాల విద్యాసంస్థలు
టీజీటీ : 594
జూనియర్ లెక్చరర్లు : 414
లైబ్రేరియన్లు : 200
స్టాఫ్ నర్సులు : 127
ఫిజికల్ డైరెక్టర్లు : 60
క్రాఫ్ట్ టీచర్లు : 38
పీఈటీ : 12