పలు రోజులుగా ఘాతుకం..
ఇద్దరు మైనర్లతో సహా ఐదుగురి అరెస్టు
సికింద్రాబాద్, జూన్ 7: సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఒక బాలికపై లైంగికదాడికి పాల్పడిన కేసులో కార్ఖానా పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీరిలో ఇద్దరు మైనర్లు, ముగ్గురు యువకులు ఉన్నారు. సీఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. కార్ఖానా పరిధిలో నివసించే బాలికకు సామాజిక మాధ్యమంలో సైదాబాద్, వనస్థలిపురానికి చెందిన ఇద్దరు బాలురతో పరిచయం ఏర్పడింది. గత మార్చి 6న వారిద్దరు ఆ బాలికను హైటెక్సిటీ ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం ఎల్బీనగర్, చైతన్యపురి ప్రాంతాల్లో లాడ్జీలను అద్దెకు తీసుకొని బాధితురాలిపై పలుమార్లు లైంగికదాడి చేశారు. ఆ అకృత్యాన్ని వీడియో తీసి, బాలికను బెదిరించారు. వారి స్నేహితులు ఎల్బీనగర్కు చెందిన డిగ్రీ విద్యార్థి రిషిత్, పటాన్చెరువు ప్రాంతానికి చెందిన బీఫార్మసీ విద్యార్థి సాయిచైతన్య, అదే ప్రాంతానికి చెందిన డిగ్రీ ఫైనలియర్ విద్యార్థి శౌర్య సైతం బాలికను లాడ్జీలకు రప్పించి ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారు.
మానసికంగా కుమిలిపోతున్న బాలికను కుటుంబసభ్యులు మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లడంతో ఈ విషయం బయటపడింది. దీంతో ఆమె తండ్రి గత నెల 30న నిందితులపై కార్ఖానా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లను జువైనల్ హోంకు, ముగ్గురు యువకులను చంచల్గూడ జైలుకు ఈ నెల 2న తరలించారు.