హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 పాఠ్యాంశాల్లో తెలుగు అకాడమీ అధికారులు స్పల్ప మార్పులు చేశారు. తెలంగాణ జాగ్రఫీ, ఎకానమీ పుస్తకాల్లో వర్తమాన అంశాలకు చోటు కల్పించారు. ఇప్పటికే తెలంగాణ జాగ్రఫీ పుస్తకం అందుబాటులోకి రాగా, ఎకానమీ పుస్తకం పదిరోజుల్లో ముద్రణ పూర్తికానున్నది.
మార్పులు ఇవి..
కొత్త జిల్లాల ఏర్పాటుతో భౌగోళిక స్వరూపం మారిపోయింది. పట్టణాలు స్మార్ట్సిటీలుగా అభివృద్ధి చెందుతున్నాయి. వాటన్నింటిపై ప్రశ్నలడిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో పెద్ద జిల్లా, చిన్న జిల్లా, అక్షరాస్యత రేటు, లింగ నిష్పత్తి వంటి అంశాల్లో మార్పులు చోటుచేసుకోగా, వాటిని జాగ్రఫీ పుస్తకాల్లో చేర్చారు.
ఎకానమీ సబ్జెక్టులో బడ్జెట్పై చాలా ప్రశ్నలు ఉంటాయి. తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ వివరాలను ఎకానమీ పుస్తకాల్లో చేర్చారు. తాజా జీఎస్డీపీ, తలసరి ఆదాయం గణాంకాలు, సెక్టోరల్ ట్రెండ్స్, సర్వీస్ సెక్టార్ ట్రెండ్స్, ఖాయిలా పడ్డ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, పారిశ్రామిక పాలసీ వివరాలను చేర్చారు. తాజా ఆర్థిక సర్వే, కాగ్ నివేదికల్లోని ముఖ్యాంశాలను పాఠ్యాంశాల్లో చేర్చారు.
లక్ష పుస్తకాల విక్రయం
నోటిఫికేషన్ల నేపథ్యంలో తెలుగు అకాడమీ పుస్తకాలకు భారీ డిమాండ్ ఉంటున్నది. ఉద్యోగార్థులు తెలుగు అకాడమీ ముద్రించిన పుస్తకాలనే ఇష్టపడుతుండటంతో విక్రయాలు పెరిగాయి. నెలన్నరలో లక్షకుపైగా పుస్తకాలను విక్రయించినట్టు తెలుగు అకాడమీ అధికారులు వెల్లడించారు. డిమాండ్ నేపథ్యంలో పుస్తకాలను పునఃముద్రించి పది రోజుల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
గ్రూప్-1కు 64,738 దరఖాస్తులు
హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): గ్రూ ప్-1కు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 64,738కి చేరింది. కొత్తగా 94,765 మంది ఓటీఆర్ నమోదు చేసుకున్నారు. కాగా ఇప్పటికి 2,00,656 మంది ఓటీఆర్ను ఎడిట్ చేసుకున్నారు. ఓటీఆర్ నమోదు, ఎడిట్ చేసుకున్న వారి సంఖ్య 2,95,421కి చేరింది. కాగా.. టీఎస్పీఎస్సీలో గతంలోనే 25,38,590 మంది అభ్యర్థులు ఓటీఆర్ చేసుకున్నారు. కొత్తగా వచ్చిన జోనల్ వ్యవస్థ ప్రకారం వీళ్లంతా ఓటీఆర్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. ఓటీఆర్ చేసుకోకపోతే ఉద్యోగానికి దరఖాస్తు చేయడం కుదరదు. గ్రూప్-1కు మే 31వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. చివరిరోజు వరకూ వేచిచూడకుండా ఓటీఆర్ నమో దు, ఎడిట్ ప్రక్రియను పూర్తి చేయాలని, గ్రూప్-1కు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచిస్తున్నది.