హైదరాబాద్ : గ్రామ పంచాయతీల పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.1190 కోట్ల నిధులను విడుదల చేసింది . సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు(Minister Harish Rao), పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో భేటీ కాగా, మంగళవారం ఇద్దరు మంత్రులు మరోసారి భేటీ అయి అధికారులతో చర్చించి రూ.1190 కోట్లు విడుదలకు ఆదేశాలు జారీ చేశారు.
వివిధ పనుల కింద చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు ఈ మొత్తాన్ని చెల్లించనున్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున గ్రామాల్లో అభివృద్ధి పనులను చేపట్టిందన్నారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణతో పాటు, పంచాయతీలకు నిధులు విడుదలపై రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రతినిధులు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెకల్లి దయాకర్ రావును హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో కలిసి సంతోషం వ్యక్తం చేశారు. నిధులను విడుదల చేయడం పట్ల పంచాయతీల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ మనసున్న మహరాజని కొనియాడారు. మాట తప్పకుండా, అందరి శ్రేయోభిలాషిగా ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రగతిని దృష్టిలో పెట్టుకుని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, నిధులు విడుదల చేస్తూ అభివృద్ధిని నిరాటంకంగా కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా వారు సీఎం కేసీఆర్, మంత్రులు కేటిఆర్, హరీశ్రావు,ఎర్రబెల్లి దయాకర్ రావు, రైతు బంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వ రెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను జూనియర్ పంచాయ కార్యదర్శులు ధన్యవాదాలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బూడిద రామ్ రెడ్డి, సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కొలను శ్రీ రెడ్డి, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం ప్రతినిధులు శశిధర్, శివ భాస్కర్, తదితరులు ఉన్నారు.