హైదరాబాద్ : తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరాకరిస్తున్నది. ఇందుకు నిరసనగా శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ ధర్నా కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చింది. అదులో భాగంగా బుధవారం ఇందిరా పార్కు వద్ద మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..బీజేపీ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ధర్నా చేస్తున్నారు. వారికి మద్దతుగా టీఆర్ఎస్ హైదరాబాద్లో ఈ నెల 12న భారీ ధర్నా నిర్వహించనున్నదని తెలిపారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగింది. దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందన్నారు.
కేంద్రం తెలంగాణను ప్రోత్సహించకుండా ఇబ్బంది పెడుతుందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయం రంగంలో నల్లచట్టాలను తెచ్చి రైతులను నట్టేట ముంచు ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర నేతలు డ్రామాలు చేస్తున్నారు. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే వరకు నిరంతర పోరాటం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
దేశంలోని అన్ని ప్రతిపక్షాలను ఏకం చేసి ఢిల్లీలో ధర్నా చేస్తాం. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఎలా జరుగుతాయో చూస్తామన్నారు. హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. రైతు మద్దతు ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగం అభివృద్ధి పథంలో పయనిస్తుంటే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాల ద్వారా రైతులు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. మంత్రుల వెంట ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, డిప్యూటీ మేయర్ శ్రీలత తదితరులు ఉన్నారు.