హైదరాబాద్ : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల ఉద్యోగులు, అధికారులు రూపొందించిన పల్లె ప్రగతి- 2022 డైరీని మంత్రులు మంత్రి హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావుల శాసన మండలి ఆవరణలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాత్ర అభినందనీయమన్నారు. ఈ రోజు పల్లెలు పచ్చగా ఉన్నాయంటే ఈ శాఖల అధికారులే కారణమన్నారు.
ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేయడం వల్లే కేంద్ర అవార్డులు, రివార్డులు వస్తున్నాయన్నారు.
అంతేగాక మన తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా, తలమానికంగా నిలవడానికి కారణం కూడా అధికారులేనని మంత్రులు తెలిపారు. ప్రత్యేకించి పల్లె ప్రగతి కార్యాక్రమాన్ని అత్యంత నిబద్ధతో అమలు చేశారన్నారు. మంచి ఫలితాలు వస్తున్నాయని, కరోనా వంటి భయంకర వ్యాధులను సైతం ఎదుర్కోగలిగే స్థాయిలో పారిశుధ్య పనులు చేపట్టారన్నారు.
అంతేగాక పల్లె ప్రగతి పేరుతో డైరీని తేవడం, అందులో నర్సరీలు, డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృ వనాలు, బృహత్ ప్రకృతి వనాలకు సంబంధించిన ఫొటోలు ఏర్చి కూర్చారని, ఇది వారి నిబద్ధతకున నిదర్శనమన్నారు. కార్యక్రమంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ ఎ.శరత్, తదితరులు పాల్గొన్నారు.