పాలకుర్తి రూరల్, నవంబర్ 26: దేవాదుల పనులను సత్వరం పూర్తి చేసి ప్రతి చెరువును నింపాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని అందుకోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శనివారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం భీక్యానాయక్ పెద్దతండా, వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కోలన్పల్లిలో జే చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు మూడో దశ పనులపై కలెక్టర్లు సీహెచ్ శివలింగయ్య, గోపితో కలిసి భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
భూములు కోల్పోతున్న రైతులకు రూ.9 లక్షల వరకు పరిహారం వచ్చేలా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఎక్కువ డబ్బుల కోసం భూ సేకరణ పనులకు అడ్డుపడటం సరికాదన్నారు. ప్రాజెక్టు పనులు పూర్తయితే పాలకుర్తి, రాయపర్తి, పెద్దవంగర, కొడకండ్ల మండలాల్లోని ప్రతి చెరువును గోదావరి జలాలతో నింపుతామని తెలిపారు. 365 రోజులు చెరువుల మత్తడి దుంకుతాయన్నారు.
పాలకుర్తి నియోజకవర్గంలో దేవాదుల ప్రాజెక్టు కింద 9,780 ఎకరాలకు సాగునీరు అందుతున్నదని తెలిపారు. 247 మంది రైతులు 142 ఎకరాలను భూ సేకరణలో భూములు కోల్పోతున్నారని చెప్పారు. ఇండ్లు, భూములు కోల్పోయిన రైతులకు ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. కాంగ్రెస్ పాలనలో దేవాదుల ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైందని.. ఈ ప్రాజెక్టు పనులకు అప్పటి పాలకులు రూపాయి ఇవ్వలేదన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే మూడేండ్లు పనులు ముందుకు సాగలేదన్నారు. పాత టెండర్ రద్దు చేసి కొత్తగా పిలిచామని తెలిపారు.