ఖమ్మం, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఫారెస్ట్ రేంజ్ అధికారి చలమల శ్రీనివాసరావు హత్యను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటున్నదని, హంతకులను వదిలే ప్రసక్తే లేదని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హెచ్చరించారు. అడవులను రక్షించే అధికారులకు ఆయుధాలను అందించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నదని తెలిపారు. అటవీశాఖ ఉద్యోగులపై దాడులను ఏ మాత్రమూ సహించబోమని స్పష్టం చేశారు. గొత్తికోయల దాడిలో మరణించిన ఫారెస్ట్ రేంజ్ అధికారి చలమల శ్రీనివాసరావు అంత్యక్రియలు బుధవారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడిలో జరిగాయి. అంత్యక్రియలు పూర్తయిన అనంతరం మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇతర రాష్ర్టాల నుంచి వలస వచ్చిన గొత్తి కోయల్లో కొందరు ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. రేంజ్ అధికారిని హత్య చేయాల్సిన అవసరం వారికి ఏమొచ్చిందని, వారిని ఎవరు ప్రేరేపిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పోడు భూముల అంశంపై ప్రభుత్వం ఇప్పటికే క్షేత్రస్థాయిలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, సమగ్ర సర్వే అనంతరం అర్హులందరికీ హక్కు పత్రాలు కల్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందని చెప్పారు.
ఇతర రాష్ర్టాల నుంచి వలస వచ్చిన గొత్తికోయలు అడవులను నరుకుతున్నట్టుగా.. వాటిని కాపాడే అధికారులనూ నరుకుతామంటే ప్రభుత్వం ఊరుకోబోదని రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హెచ్చరించారు. అటవీ అధికారులను అడ్డుకుంటే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.
ఎఫ్ఆర్వో శ్రీనివాసరావుకు ప్రభుత్వ లాంఛనాలతో ఈర్లపూడిలో బుధవారం అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియలకు మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, జడ్పీ చైర్మన్లు లింగాల కమల్రాజు, కోరం కనకయ్య హాజరయ్యారు. ముందుగా మంత్రులు ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అంతిమయాత్రలో పాల్గొని శ్రీనివాసరావు పాడె మోశారు. అంత్యక్రియల్లో హరితహారం ఓఎస్డీ ప్రియాంకా వర్గీస్, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతకుమారి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్ఎం డోబ్రియాల్, ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు వీపీ గౌతమ్, అనుదీప్, ఐటీడీఏ పీవో గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రి జిల్లా చండ్రుగొండ ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హత్య కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిని రిమాండ్కు తరలించినట్టు కొత్తగూడెంలో ఎస్పీ వినీత్ గంగన్న తెలిపారు. రేంజర్ హత్యపై సెక్షన్ ఆఫీసర్ చేసిన ఫిర్యాదు మేరకు చండ్రుగొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. రేంజర్పై వేటకొడవళ్లతో దాడి చేసిన గొత్తికోయలకు చెందిన ఇద్దరు వ్యక్తులు తల, నంగాను అదుపులోకి తీసుకుని, రిమాండ్కు తలరించినట్టు వెల్లడించారు. వారివద్ద నుంచి దాడికి వినియోగించిన వేట కొడవళ్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.