ఆదిలాబాద్ : ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.
నాగోబా ఆలయం అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని వివరించారు.
ఆలయంలోని వివిధ పనులకు రూ.4 కోట్లను కేటాయించినట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
అనంతరం నిర్మల్ జిల్లా పర్యటన సందర్భంగా ఫారెస్ట్ గెస్ట్ హౌజ్లో జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో, అదనపు కలెక్టర్, గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల అధికారులు, ఇతర జిల్లా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.
పోడు భూములకు త్వరలో పట్టాలు ఇస్తామన్నారు. ఆ భూములకు నీరు, కరెంట్ సదుపాయం ఇచ్చి సాగు యోగ్యం చేస్తామని, రైతు బంధు, రైతు బీమా కూడా ఇస్తామని మంత్రులు తెలిపారు.