నిజామాబాద్, జూన్ 2, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా బాధితులకు మరింత మెరుగైన చికిత్స అందించేందుకు రోడ్లు, భవనాలశాఖమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ముందుకొచ్చారు. తన స్నేహితులతో కలిసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ.కోటిన్నర నిధులతో నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రభుత్వ దవాఖానల్లో వసతులు కల్పించేందుకు సిద్ధమయ్యారు. బాల్కొండ నియోజకవర్గం, ఆర్మూర్ ఏరియా దవాఖాన, జీజీహెచ్లో పలు వసతులు ఏర్పాటుచేయబోతున్నట్టు మంత్రి ప్రశాంత్రెడ్డి వెల్లడించారు. సీఎస్ఆర్ కింద చేపట్టబోయే కార్యక్రమాలను త్వరగా అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి ప్రకటించారు.
బాల్కొండలో 102 ఆక్సిజన్ బెడ్లు
బాల్కొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రశాంత్రెడ్డి.. నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో 102 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయనున్నారు. బాల్కొండ, మోర్తాడ్ ఏరియా దవాఖానల్లో ఐదేసి చొప్పున, ఆర్మూర్ ఏరియా దవాఖానలో పది ఐసీయూ బెడ్లు ఏర్పాటుచేయనున్నారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో పిల్లల కోసం ప్రత్యేకంగా పీడియాట్రిక్ వెంటిలేటర్ తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. థర్డ్ వేవ్ ముప్పు పిల్లలపై పడుతుందనే అంచనాల నేపథ్యంలో ఈ పరికరం కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
కొవిడ్ అంతానికి మా వంతు ప్రయత్నం
జీజీహెచ్లోనే 237 ఆక్సిజన్ బెడ్లుంటే కొవిడ్ వేళ వాటిని 537 బెడ్లకు పెంచాం. ఆర్మూర్లో వంద ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటుచేశాం. బోధన్లో 14 ఆక్సిజన్ బెడ్లుంటే 50కి పెంచాం. అయినా సరిపోవడం లేదు. మా మిత్రులతో చర్చిస్తే కొంతమంది సాయం చేయడానికి ముందుకొచ్చారు. వారంనుంచి కలెక్టర్, డీఎంహెచ్వోతో కలిసి ప్రణాళిక రూపొందించాం. నియోజకవర్గంలోని అన్ని బెడ్లను ఆక్సిజన్గా మారుస్తాం. కొవిడ్ ఏ రూపంలో వచ్చినా ఎదుర్కోవాలనే తాపత్రయం మాలో ఉన్నది. సీఎస్ఆర్ కింద రూ.కోటిన్నర సొంత నిధులతో వీటన్నింటిని ఏర్పాటు చేయబోతున్నాం.