హైదరాబాద్ : అంతర్జాతీయ ప్రమాణాలతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) ఆధ్వర్యంలో నిర్మాణరంగ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం మంత్రుల నివాస ప్రాంగణంలోని తన అధికారిక నివాసంలో యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియపై న్యాక్ డైరెక్టర్ జనరల్ భిక్షపతితో పాటు సంబంధిత అధికారులతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. నిర్మాణ రంగాన్ని బలోపేతం చేసేందుకు, నిపుణులైన కార్మికుల కొరతను అధిగమించేందుకు వీలుగా నిర్మాణ రంగ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి వేముల తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
భారత దేశంలో నిర్మాణ రంగం రోజు రోజుకు పుంజుకుంటుంది. ప్రపంచ దేశాలు సైతం అధునాతన టెక్నాలజీ ఉపయోగించి నిర్మాణాలు చేస్తున్నాయి. దేశ నిర్మాణ రంగ వ్యవస్థ కూడా అంతటి అధునాతన టెక్నాలజీ అందుకోవాల్సిన అవసరం ఉన్నది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో దూర దృష్టితో ఆలోచించి ప్రపంచంతో పోటీ పడే విధంగా అలాంటి విద్యా ప్రమాణాలు తీసుకురావాలని, నిర్మాణ రంగం కోసం నైపుణ్యం కలిగిన విద్యార్థులను తయారు చేయాలని నిర్మాణ రంగ యూనివర్సిటీ ఏర్పాటుకు గల అవకాశాలు పరిశీలించాలని అదేశించారు. ప్రస్తుతం నిర్మాణం రంగంలోకి వస్తున్న వారికి పాత పద్దతిలోనే బోధన జరుగుతుంది. కానీ ఈ యూనివర్సిటీ ద్వారా ప్రపంచంతో పోటీ పడే విధంగా జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో టెక్నాలజీ విద్య అందనుంది. ఇందులో అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, రీసెర్చ్ విద్య బోధన ఉండనుంది. కొత్త రీసెర్చ్ కోర్సులు కూడా ఇందులో ప్రవేశపెట్టొచ్చు. దీని ద్వారా నిర్మాణ రంగ ఇంజినీర్లు, నిపుణులు,సైంటిస్టులు ఎంతో మంది తయారవుతారు. తెలంగాణతో పాటు దేశ నిర్మాణ రంగ వ్యవస్థలోనే వారు కీలకం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసం సకల సౌర్యాలతో, నూతన టెక్నాలజీకి తగ్గ ప్రమాణాలతో హైదరాబాద్లోని 46 ఎకరాల విస్తీర్ణం ఉన్న న్యాక్ ప్రాంగణంలో 12 ఎకరాల్లో యూనివర్సిటీ ఏర్పాటుపై పరిశీలిస్తున్నాం అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్బంగా నిర్మాణ రంగ యూనివర్సిటీ ఏర్పాటు స్థల మ్యాప్ను మంత్రి వేముల పరిశీలించారు. నిర్మాణ రంగ యూనివర్సిటీ కోసం కట్టాల్సిన బిల్డింగులు, ఇతర సౌకర్యాలు, కావాల్సిన ఫ్యాకల్టీలకు అయ్యే ఖర్చును అంచనా వేయాలని మంత్రి అదేశించారు. కరిక్యులం,సిలబస్, బోధనలో అధునాతన టెక్నాలజీకి సంబంధించిన సమగ్రమైన సమాచారంతో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. న్యాక్ డైరెక్టర్ జనరల్కు యూనవర్సీ ఏర్పాటుకు సంబంధించిన పలు అంశాలపై మంత్రి సూచనలు చేశారు.