భీమ్గల్/వేల్పూర్, నవంబర్ 25 : అసైన్డ్, పోడు భూములకు పట్టాలిప్పించి భూమి హక్కులు కల్పించామని ఆర్అండ్బీ శాఖ మంత్రి, బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్, వేల్పూర్ మండలాల్లో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. పోడు, అసైన్డ్ భూములకు పట్టాలు లేక రైతుబంధు ఇతర ప్రయోజనాలు అందక బాధపడేవారని, ఇప్పుడు ఆ సమస్య లేకుండా చేశామని అన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో మోతె గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, ఏమాత్రం లోటైనా కేసీఆర్ ఊరుకోరని తెలిపారు.
మోతె మట్టిని కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా చల్లి ఉద్యమస్ఫూర్తి రగిలించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా మోతెలో పీఏసీఎస్ను ఏర్పాటు చేయించినట్టు చెప్పారు. గ్రామం చుట్టూ ఉన్న రెండు వాగుల్లో చెక్ డ్యాంలు నిర్మించి ద్వీపంలా తీర్చిదిద్దినట్టు తెలిపారు. చెరువుకు మాటుకాలువ నిర్మించి శాశ్వతంగా నీటి సమస్య పరిష్కరించినట్టు చెప్పారు. కారు గుర్తుకు ఓటువేసి మరోసారి ఆశీర్వదించాలని కోరారు.