నిజామాబాద్ : స్వీయ నియంత్రణ పాటిస్తూ, మాస్కులు ధరించడమే శ్రీరామ రక్ష.. చేతులు ఎప్పుడూ శుభ్రం చేసుకుంటూ.. ఇంట్లో కూడా మాస్క్ ధరించాలి అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్ పై నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల్లో వేర్వేరుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. కామారెడ్డి లో నిర్వహించిన సమావేశానికి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యే హనుమంత్ షిండే, ఎంపీ బీబీ పాటిల్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కోవిడ్ రెండవ దశలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చించాం. జిల్లాలో అధిక సంఖ్యలో కొవిడ్ పరీక్షలు చేయడం, పాజిటివ్ వచ్చిన వారికి వైద్యం అందించడం, కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం, టీకాలు వేయడం వంటి అంశాలపై చర్చించామని తెలిపారు. జిల్లాలో 29 పరీక్షా కేంద్రాలలో ప్రతి రోజు 3,000 వరకు కోవిడ్ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
కరోనా రెండవ దశలో జిల్లాలో ఒక లక్షా 50 వేల మందికి పరీక్షలు చేయగా 4,000 కేసులు యాక్టివ్లో ఉన్నాయి. అందులో 50 మంది ప్రభుత్వ ఏరియా, జిల్లా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. మిగతావారు వైద్యుల సూచనల మేరకు హోమ్ ఇసొలేషన్ లు ఉన్నారు. జిల్లాలో ఇప్పటికే 40 ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయి. మరో 90 బెడ్ల ఏర్పాటుకు.. బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో 50, దోమకొండ పిహెచ్సీలో 10, మద్నూర్ 10, ఎల్లారెడ్డి లో 10 ఆక్సిజన్ బెడ్లు పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. మొత్తం 140 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉండేవిధంగా ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు.
జిల్లాలో 30 వాక్సినేషన్ కేంద్రాల ద్వారా 2.30 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేయాల్సి ఉండగా ఇప్పటివరకు ఒక లక్ష మందికి(44 శాతం మందికి) టీకా వేసి కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉంది. జిల్లాలో రోజుకూ 4 వేల నుండి 5 వేల మందికి టీకా వేస్తున్నామని మంత్రి వేముల తెలిపారు. వ్యాక్సినేషన్ కోసం సిబ్బంది కొరత ఉన్నందున.. కొంత మంది వైద్య సిబ్బంది కరోనా బారిన పడిన నేపథ్యంలో తాత్కాలిక పద్దతిలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, మెడికల్ ఆఫీసర్లను అవసరమైన మేరకు కలెక్టర్ ఆధ్వర్యంలో నియమించుకోవాలని అదేశించామని చెప్పారు.
అలాగే రెవెన్యూ, పోలీసు విభాగాలతో ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ఏర్పాటు చేసి మహారాష్ట్ర బోర్డర్లో రాకపోకలపై నిఘా ఏర్పాటు చేశామని మంత్రి స్పష్టం చేశారు. తప్పనిసరి అయితేనే ప్రజలు బయటకురండి. మార్కెట్, కిరాణా, జనరల్ షాపులు, విక్రయాల షాపుల్లో తప్పనిసరిగా మస్కులు వాడాలి. శానిటైజర్లు వినియోగించాలి. ప్రభుత్వ కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అదేశించాం. మాస్కు లేకుంటే ఫైన్ వేస్తారు. మాస్కులు ధరించడమే శ్రీరామ రక్ష. చేతులు ఎప్పుడూ శుభ్రం చేసుకుంటూ.. ఇంట్లో కూడా మాస్క్ ధరించాలి. చిన్న పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి అని మంత్రి వేముల సూచించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంతు షిండే, జడ్పీ చైర్ పర్సన్ శోభా, మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, జిల్లా కలెక్టర్ శరత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే పలువురు రెవెన్యూ, పోలీసు విభాగాల అధికారులు పాల్గొన్నారు.