హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర 2023-24 వార్షిక బడ్జెట్ను శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి శాసనమండలిలో ప్రవేశపెట్టారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు సభ ప్రారంభంకాగానే మండలిలో ఆర్థికశాఖ మంత్రి తరపున బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు మంత్రి ప్రశాంత్రెడ్డికి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అనుమతిచ్చారు. ఉదయం 10.30 గంటలకు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన మంత్రి ప్రశాంత్రెడ్డి 12.16 గంటలకు ముగించారు. దాదాపు 1 గంట 46 నిమిషాలపాటు బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. ప్రశాంత్రెడ్డి మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టడం వరుసగా ఇది నాలుగోసారి.
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఎనిమిదిన్నరేండ్ల స్వల్పకాలంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నదని ప్రశాంత్రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ మహా సంకల్పాలనికి తెలంగాణ ప్రజలు అన్ని విధాల అండగా ఉండాలని కోరుతూ బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత ఆయనకు మంత్రులు సత్యవతిరాథోడ్, మహమూద్ అలీ, సభ్యులు పల్లా రాజేశ్వర్రెడ్డి, కవిత, వాణీదేవి, కడియం శ్రీహరి, భానుప్రసాద్రావు, పాడి కౌశిక్రెడ్డి, గోరటి వెంకన్న, కాటేపల్లి జనార్థన్రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మండలిని బుధవారానికి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి వాయిదా వేశారు.
సంక్షేమానికి పెద్దపీట
ఆసరా పింఛన్లకు రూ.12 వేల కోట్లు కేటాయించగా, 5.51 లక్షల మంది వికలాంగులకు లబ్ధి చేకూరనున్నది. వికలాంగుల సంక్షేమ శాఖకు రూ.25 కోట్లు కేటాయించి వారి సంక్షేమానికి పెద్దపీట వేశారు. కేసీఆర్ సమర్థ నాయకత్వమే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కారణం. అన్నివర్గాల అభిమతాన్ని గౌరవిస్తూ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది.
-వాసుదేవరెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్
దేశానికే దిక్సూచి
ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యం గా బడ్జెట్ రూపకల్పన జరిగింది. బీఆర్ఎస్ స్థాపిం చి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన కేసీఆర్ తన ఎజెండాను రాష్ట్ర బడ్జెట్ రూపంలో ప్రజల ముందు ఉంచారు. విద్యారంగానికి అధిక నిధులు కేటాయించడంతోపాటు యూనివర్సిటీల్లో హాస్టళ్ల పునర్నిర్మాణానికి రూ.500 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– తుంగ బాలు, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
కేంద్రం అడ్డంకులు
ఇది ముమ్మాటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే బడ్జెట్. మానవీయ దృక్పథం, నిర్మాణాత్మక ఆలోచన, దార్శనికమైన ప్రణాళిక రచన, పారదర్శకమైన పరిపాలనకు నిలువెత్తు నిదర్శనం. ఆర్థిక మాంద్యం, కరోనా వంటి సంక్షోభాలు ఎదురైనా తట్టుకొని బలీయమైన శక్తిగా తెలంగాణ ఎదిగింది. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంటే కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్నది.
– నామా నాగేశ్వరరావు, ఎంపీ
ప్రజల ఆశలు నెరవేరే పద్దు
రాష్ట్ర బడ్జెట్ జనరంజకంగా, అందరి ఆశలు, ఆశయాలను పూర్తిస్థాయిలో నెరవేర్చేలా ఉన్నది. సంక్షేమం, అభివృద్ధి రెండు కండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ సుపరిపాలన అందిస్తున్నారని చెప్పడానికి ఈ బడ్జెట్ ఉదాహరణ. సీఎం కేసీఆర్ ఆలోచనలు, దూరదృష్టి, పకా ప్రణాళికలతో తెలంగాణలో జల, విద్యుత్తు, హరిత, శ్వేత, నీలి, పింక్, ఐటీ, ఫార్మా, మెడికల్, టూరిజం, పారిశ్రామిక విప్లవాలు వచ్చాయి.
– వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ
విద్యకు నిధులు భేష్
మునుపెన్నడూ లేని విధంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. సుస్థిర ప్రభుత్వం, సమర్థ నాయకత్వం వల్లే రాష్ట్ర ప్రజలకు ప్రగతి ఫలాలు అందుతున్నాయి. ఈ బడ్జెట్లో నీటిపారుదల, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. విద్యాశాఖకు రూ.19,093 కోట్లు కేటాయించి ఆ రంగం పురోగతికి సీఎం విశేష కృషి చేశారు.
-మహేశ్ బిగాల, బీఆర్ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్
ప్రజా సంక్షేమమే గీటురాయి
‘ప్రతి ఇంటికి సంక్షేమం-ప్రతి ముఖంలో సంతోషం’ అన్న నినాదాన్ని అక్షర సత్యం చేసిందీ బడ్జెట్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించిన నిధులు ఘనంగా ఉన్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు, సామాజిక అభివృద్ధి, సంపద పంపిణీ, నూతన అవకాశాలు కల్పించేలా రూపొందించారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వల్లే ఇంతటి ఊహించని ప్రగతిని ప్రభుత్వం సాధిస్తున్నది.
-కృష్ణమోహన్రావు, బీసీ కమిషన్ చైర్మన్
6,229 వేల కోట్లు చరిత్రాత్మకం
దేశవ్యాప్తంగా బీసీలకు కేంద్ర బడ్జెట్లో రూ.2 వేల కోట్లు కేటాయిస్తే, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో రూ. 6,229 కోట్లు కేటాయించడం చరిత్రాత్మకం. తెలంగాణ బడ్జెట్లో నిరుడు బీసీలకు రూ.5 వేల కోట్లు కేటాయిస్తే, ఈ సారి రూ.6,229 కోట్లు కేటాయించడం అభినందనీయం. మోదీ ప్రభుత్వం బీసీలను చిన్నచూపు చూస్తున్నది. బడ్జెట్లో నిధుల కేటాయింపే ఇందుకు నిదర్శనం. బీసీల సత్తాను మోదీ సర్కారుకు చూపి స్తాం.
-ఆర్ కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు
ప్రజా ఆమోదయోగ్య బడ్జెట్
రాష్ట్ర బడ్జెట్ ప్రజామోదయోగ్యమైనది. అన్నివర్గాల సంక్షేమంతోపాటు విద్య, వైద్యం, వ్యవసా య రంగాలకు భారీగా నిధులు కేటాయించారు. మహిళలు ఆర్థిక ప్రగతి సాధించేలా నిధులు కేటాయించడం సంతోషకరం. దళితులు, మైనార్టీల భద్రత, సంక్షేమం, అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అంకితభావంతో ముందుకు సాగుతున్నారు.
-అనిల్ కూర్మాచలం, ఎఫ్డీసీ చైర్మన్