హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కొనసాగుతున్న నుమాయిష్లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్ను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ స్టాల్లో ఏర్పాటుచేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సెక్రటేరియట్, అమరవీరుల స్మారక చిహ్నం, ఇంటిగ్రేటెడ్ జిల్లా కలెక్టరేట్ నిర్మాణాల నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రజలకు అర్థమయ్యే రీతిలో నమూనాలు రూపొందించారని అధికారులను మంత్రి అభినందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆలోచనలతో ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో చరిత్రలో నిలిచిపోయేలా ఐకానిక్ నిర్మాణాలు రూపుదిద్దుకొన్నాయని అన్నారు. 2014కు ముందు ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో 30 లక్షల స్కేర్ ఫీట్ల విస్తీర్ణంగల నిర్మాణాలే పూర్తయ్యాయని, తెలంగాణ వచ్చాక 8 ఏండ్లలో కోటి స్కేర్ ఫీట్ల బిల్డింగ్ నిర్మాణాలు పూర్తి చేసినట్టు చెప్పారు. మరో కోటి స్కేర్ ఫీట్ల బిల్డింగ్లు నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు. ఇందుకోసం రూ.20వేల కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. హుస్సేన్సాగర్ తీరాన నిర్మిస్తున్న అమరవీరుల స్మారక చిహ్నం ప్రపంచంలోనే గొప్ప కట్టడంగా నిలువనుందని తెలిపారు. చికాగో, దుబాయ్ తర్వాత హైదరాబాద్లోనే అలాంటి నిర్మాణం ఉందని తెలిపారు. ఇతర రాష్ర్టాల్లోని సెక్రటేరియట్లకంటే తెలంగాణలోని ఇంటిగ్రేటెడ్ జిల్లా కలెక్టరేట్లు గొప్పగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన వెంట ఆర్ అండ్ బీ ఈఎన్సీలు గణపతిరెడ్డి, రవీందర్రావు, సీఈలు సతీష్, మధుసూదన్, ఈఈ శ్రీనివాస్, డీఈ మాధవి, అధికారులు ఉన్నారు.