నిజామాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): షబ్బీర్ అలీ ఓ చెల్లని రూపాయి లాంటివారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. ఆయన ఆరోపణల్లో పూర్తి అభద్రతాభావం, నైరాశ్యం స్పష్టంగా కనిపిస్తున్నదని, ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కాడెత్తేసిందని ఆరోపించారు. ప్రజలు స్వచ్ఛందంగా సీఎం కేసీఆర్కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు చేస్తుంటే, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ.. ఈసీకి ఫిర్యాదు చేయడం, ఎమ్మెల్సీ కవితపై అక్కసు వెళ్లగక్కడంపై మంత్రి ఘాటుగా స్పందించారు.
ఓటమి ఖాయమైందని నిర్ణయించుకుని అసత్య ఆరోపణలకు కాంగ్రెస్ తెరలేపిందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటమి ఎరుగని కేసీఆర్ గురించి 8 సార్లు పోటీ చేసి 6 సార్లు ఓడిపోయిన షబ్బీర్.. ఈ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉన్నదని శుక్రవారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. ఓటమి తప్పదని గ్రహించిన షబ్బీర్ అలీని ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్గా అభివర్ణించారు. కేసీఆర్ తెలంగాణలో ఏమూల నుంచి పోటీ చేసినా ప్రజలు బ్రహ్మరథం పట్టి అక్కున చేర్చుకుంటారని నొక్కి చెప్పారు.
కామారెడ్డి నుంచి పోటీ చేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులంతా పలుమార్లు విజ్ఞప్తి చేస్తే కేసీఆర్ పోటీకి ఒప్పుకున్నారని గుర్తుచేశారు. ‘మాకు కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి. ఆయన వస్తే మా ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది’ అని ప్రజల్లో విశ్వాసం పెరిగి, ఆయన పోటీ చేయాలని వారు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారని స్పష్టంచేశారు. ఓటమి భయంతోనే ప్రజలు స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ ఎన్నికల కమిషన్కు షబ్బీర్ ఫిర్యాదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రశాంత్రెడ్డి చెప్పారు.
కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని కాంగ్రెస్ ఇప్పటికే అంగీకరించి కుతంత్రాలకు తెరలేపుతున్నద ని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ నేతలు అనైతిక, తెరచాటు పొత్తులతో కేసీఆర్ను ఆది నుంచి అడ్డుకునే ప్రయత్నమే చేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ డబ్బు ను, రిగ్గింగును నమ్ముకుంటే, కేసీఆర్ ఎప్పుడూ ప్రజలనే నమ్ముకున్నారని చెప్పారు. కేసీఆర్ ప్రజా మద్దతుతోనే అనేక విజయాలు సాధించారని గుర్తుచేశారు. రానున్న రోజుల్లోనూ ఆ పరంపరనే కొనసాగుతుందన్న పూర్తి విశ్వాసం తనకున్నదని వేముల చెప్పారు. చిల్లర ఆరోపణలు, చీప్ ట్రిక్స్ను కాంగ్రెస్, షబ్బీర్ అలీ ఇకనైనా మానుకోవాలని హెచ్చరించారు.
ఉద్యమ కాలం నుంచే ఏకగ్రీవాలు
కామారెడ్డి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేస్తుండటంతో ప్రతిపక్ష పార్టీల్లో వణుకు మొదలైంది. ఆగస్టు 21న స్వ యంగా కేసీఆరే ఈ విషయాన్ని ప్రకటించినప్పటి నుంచి ప్రధానంగా కాంగ్రెస్కు భయం పట్టుకున్నది. ఈ ప్రాంతం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చేతిలో వరుసగా నాలుగుసార్లు ఓడిపోయిన షబ్బీర్ అలీ ఈ విషయంపై నానా యాగి చేస్తుండటంపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏకగ్రీవ తీర్మానాలు చేస్తుంటే ఎందుకంత కడుపు మంట అని ప్రశ్నిస్తున్నారు.
తమ ఇష్టాన్ని, తమ అభిమానాన్ని తప్పు పట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి హక్కు ఎక్కడిదని నిలదీస్తున్నారు. ఉద్యమ కాలంలోనూ షబ్బీర్ అలీ సొంత మండలం మాచారెడ్డిలో ఏకగ్రీవాలతో ఎంపీపీ స్థానాన్ని గులాబీ పార్టీకి 22 ఏండ్ల క్రితమే కట్టబెట్టిన చరిత్ర ఉన్నదని గుర్తుచేస్తున్నారు. ఉద్యమ సమయంలో ఏకగ్రీవాల రూపంలో కేసీఆర్కు అండగా నిలిచిన ప్రజానీకమంతా ఇప్పుడు కూడా కామారెడ్డి నియోజకవర్గంలో గులాబీ దళపతికి స్వచ్ఛందంగా మద్దతు తెలిపితే తప్పేమున్నదని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకున్నదని విమర్శిస్తున్నారు.
జోరుగా ఏకగ్రీవ తీర్మానాలు
కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్కు మద్దతుగా ఊరూరా ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ తమ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తుండటంపై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన వ్యక్తి నేరుగా వచ్చి కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని చెప్పడం, ఈ ప్రాంత ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారు. ఇందులో భాగంగానే స్థానిక ప్రజలంతా ఏకమై కేసీఆర్కు జైకొడుతున్నారు. కామారెడ్డి మండలంలోని గర్గూల్ గ్రామంలో మొదటగా తీర్మానాల రూపంలో పలు కుల సంఘాల వారు భారీ ర్యాలీ నిర్వహించిన, కేసీఆర్కు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించారు.
అనంతరం మాచారెడ్డి మండలంలోని 9 గ్రామాలు, పాల్వంచలోని ఒక గ్రామం, రామారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లోనూ ఇదే రీతిన ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటు కుల సంఘాల బాధ్యులు, బీఆర్ఎస్ పాలనలో వివిధ పథకాలతో లబ్ధి పొందుతున్న వారంతా కేసీఆర్కు వినమ్రపూర్వకంగా మద్దతు ప్రకటించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వివిధ సంక్షేమ పథకాలతో తమను ఆదుకుంటున్న గులాబీ దళపతికి ఏదో ఒక రూపంలో మద్దతుగా నిలుస్తున్నారు. కేసీఆర్కు ఎన్నికల ఖర్చు కోసం కొంత మంది ఏకంగా పింఛన్ డబ్బులను సైతం పోగుచేసి ఇవ్వడం విశేషం.