కమ్మర్ పల్లి: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం కమ్మర్ పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన మహిళా సమాఖ్య మహాజన మరియు రుణమేళా కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమ్మర్ పల్లి మండలానికి చెందిన మహిళా సమాఖ్య సంఘాలకు 15 కోట్ల 26 లక్షల రూపాయల రుణ చెక్కును మంత్రి అందజేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్ధికంగా బలపడేందుకు ఏదైనా వ్యాపారం చేసుకోవాలనుకునే మహిళా సంఘాలకు ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రోత్సాహం అందిస్తున్నారని అన్నారు. ఒకప్పుడు రుణపరిమితి రూ.5 లక్షలు ఉంటే దాన్ని రూ.20 లక్షలకు పెంచారని, వ్యక్తిగతంగా రుణ పరిమితిని కూడా రూ.50 వేల నుంచి రూ.3 లక్షలకు పెంచారని గుర్తు చేశారు. దీంతో చాలా కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాయని తెలిపారు. ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే కమ్మర్ పల్లి మండలంలో రూ.32 కోట్ల నుంచి 160 కోట్ల రూపాయల రుణాలకు చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉన్నదన్నారు.
ఇప్పటి వరకు తీసుకున్న రుణాలను ఆర్ధిక క్రమశిక్షణతో చెల్లిస్తూ ఇంత మొత్తం రుణం పొందే స్థాయికి చేరుకోవడం చాలా గొప్ప విషయం అన్నారు. దీని ద్వారా 2600 కుటుంబాలు ఆర్థికంగా బాగుపడడం ఒక ప్రజాప్రతినిధిగా తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. ఇంతటి కృషి కేవలం మహిళల వల్లే సాధ్యం అయ్యిందని, పురుషులలో ఇంతటి సంఘటితం ఉండదన్నారు. మీరు కష్టపడి కూడ బెట్టుకున్న పైసా పైసాను ధరలు పెంచి కేంద్రం దోచుకుపోతోందని కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి మండిపడ్డారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ రేట్లు పెంచి సామాన్యులను ఇబ్బందులు పెడుతున్నారని ద్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు. మహిళలే బీజేపీ నాయకులను ఎక్కడిక్కడ నిలదీయాలని అన్నారు. రేట్లు పెంచుతూ దేవుని పేరు చెప్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఇలా మోసపోతే నష్ట పోయేది ఎవరో మహిళలే ఆలోచన చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ.. పేదలకు అన్యాయం చేసే కేంద్ర మోడీ ప్రభుత్వం పై కేసిఆర్ ప్రభుత్వం నిరంతరం పోరాడుతూనే ఉంటుందని పేర్కొన్నారు. ఎవరు ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.