హైదరాబాద్ : పారిస్కు ఈఫిల్ టవర్.. దుబాయ్కు బూర్జు ఖలీఫా ఎలాగో హైదరాబాద్కు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అలాగ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా గొప్ప అద్భుత కట్టడంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ రూపుదిద్దుకుంటుందని మంత్రి తెలిపారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనుల పురోగతి పై మంత్రి బుధవారం ఎర్రమంజిల్ ఆర్ అండ్ బి కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి, వర్క్ ఏజన్సీ ప్రతినిధి లక్ష్మణ్, మ్యూజియం నిర్మాణ నిపుణులు, పలువురు అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా రెండు నెలల్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం పూర్తి కావాలని వర్క్ ఏజెన్సీని, ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. పోలీస్ కమాండ్ సెంటర్ 14వ అంతస్థు నుంచి హైదరాబాద్ నగర నలువైపులా ఉన్న ముఖ్య ప్రదేశాలైన చార్మినార్, గోల్కొండ కోట, కేబీఆర్ పార్క్, హుస్సేన్ సాగర్ చూపరులకు ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా కన్పిస్తాయన్నారు. రానున్న రోజుల్లో సంవత్సరం పొడవునా సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలన్నారు.
పారిస్లో ఈఫిల్ టవర్, దుబాయ్లో బూర్జు ఖలీఫా మీద నుంచి ఆయా నగరాలను ఏ విధంగా సందర్శకులు వీక్షిస్తారో.. అదేవిధంగా తెలంగాణలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ 14వ అంతస్థు నుండి హైదరాబాద్ నగరాన్ని సందర్శకులు వీక్షించవచ్చన్నారు. సందర్శకుల సౌకర్యార్థం రాష్ట్ర సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణ ఖ్యాతిని చాటిచెప్పే వివరాలు, తెలంగాణ సాధించిన విజయాలు, తెలంగాణ పోలీస్ శాఖ, కమాండ్ కంట్రోల్ సెంటర్ వివరాలు అందులోనే నిర్మించే మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నామని మంత్రి తెలిపారు. ప్రముఖ మ్యూజియం నిర్మాణ నిపుణులు వసీంఖాన్ వారి భాగస్వాములు ఆధ్వర్యంలో ఈ మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.