వేల్పూర్, నవంబర్ 24 : బాల్కొండ నియోజకవర్గం( Balkonda)లో పార్టీలకతీతంగా అభివృద్ధి చేశానని, తనను మరోసారి పార్టీలకతీతంగా ఆశీర్వదించాలని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి(Minister Vemula )అన్నారు. శుక్రవారం ఆయన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని అమీనాపూర్, లక్కోర గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం లో మాట్లాడారు. కాళేశ్వరం నీటిని పోచంపాడ్లో నింపడంతో గుత్ప నవాబు ఎత్తిపోతలకు నీటి కొరత లేకుండా చేశానన్నారు.
కుల సంఘ భవనాలకు సీఎం ప్రత్యేక నిధులు తెచ్చినట్లు చెప్పారు. ఈ ప్రొసీడింగ్లు వట్టి కాగితాలని, కొందరు దిగజారి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అవి వట్టి కాగితాలు కాదని, గట్టి కాగితాలని పేర్కొన్నారు. కుల సంఘ భవనాలు, గృహలక్ష్మి ఇండ్ల నిర్మాణాలు మొదలు పెట్టుకోవచ్చని సూచించారు. బిల్లులు తప్పకుండా వస్తాయని అందుకు తనదే జిమ్మేదార్ అని స్పష్టం చేశారు.
ప్రజలను తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే కేసీఆర్ మంచి పోజిషన్లో ఉంచుతారని తెలిపారు. తాను మంచి పోజిషన్లో ఉంటే మళ్లీ ఎంతో అభివృద్ధిని అందించగలుగుతానన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు సగానికి పైగా పైరవీకారుల పాలైనవేనని గుర్తు చేశారు. కేసీఆర్ మళ్లీ గెలిస్తే సంక్షేమ పథకాలు నిరంతరంగా కొనసాగుతాయన్నారు.