నిజామాబాద్ : గ్యాస్ సిలిండర్ ధరను అమాంతం పెంచిన ప్రధాని మోదీ పేద, మధ్యతరగతి మహిళల ఉసురుపోసుకున్నారని, కేసీఆర్ మళ్లీ ప్రభుత్వంలోకి రాగానే ఆ భారాన్ని మొత్తం మోసి కేవలం నాలుగు వందల రూపాయలకు మాత్రమే సిలిండర్ అందిస్తారని మంత్రి ప్రశాంత్ రెడ్డి(Minister Vemula) అన్నారు. శుక్రవారం ఆయన ఏర్గట్ల మండలం గుమ్మిర్యాల గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చేతల ప్రభుత్వం ఏదో.. చెప్పుడు మాటల ప్రతిపక్షాల సత్తా ఏమిటో జనాలకు తెలుసునని ఆయన అన్నారు. కేసీఆర్ను మళ్లీ మూడోసారి సీఎం అవడం ఖాయమని, ఆయనకు ప్రజా ఆశీస్సులు మెండుగా ఉన్నాయన్నారు. బీజేపీ నేతలు ఆఖరుకు గ్రామాల్లో వేసే సీసీ రోడ్లు, వైకుంఠధామాల్లో కూడా తమ వాటా ఉందంటూ చీప్ పాలిటిక్స్ ప్రయోగిస్తున్నారని ఇవన్నీ వారు పాలిస్తున్న రాష్ట్రల్లో ఎందుకు లేవని ఆయన ప్రశ్నించారు.
మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఆరోగ్య శ్రీ కింద 15 లక్షల సాయం అందిస్తామని, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటి సభ్యులకు ఐదు లక్షల జీవిత బీమా అందించి కేసీఆర్ ధీమా కింద ఆ కుటుంబాలన్నింటికి అండగా ఉంటామన్నారు. రైతుబంధును ఏడాదికి 10 వేలు ఇస్తున్నామని దానిని విడతల వారీగా 16 వేలకు పెంచుతామని, పించన్లు ఐదువేలకు పెంచుకుంటామని ఆయన వివరించారు. ఏ విధంగా ప్రభుత్వం నుంచి ఆసరా అందని అర్హులైన మహిళలకు సౌభాగ్య లక్ష్మీ ద్వారా 3 వేల రూపాయలు అందిస్తామని అన్నారు.
గ్రామాల్లో అభివృద్ధి జరిగింది అని అనిపిస్తే పని చేసే ప్రభుత్వానికి పట్టం కట్టాలని ప్రశాంత్ రెడ్డి అన్నారు. చేసేది, చెప్పేది ఒక్క కేసీయారేనని, మిగిలిన నాయకులంతా చెప్పుడు మాటలతో ప్రజలను మభ్యపెట్టే వాళ్లేనన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు బీఆరెస్లో పార్టీలో మంత్రి సమక్షంలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రాజా పూర్ణానందం, జెడ్పిటిసి గుల్లే రాజేశ్వర్, ఎంపిపి ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.