హైదరాబాద్: నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనుల్లో ఇంకా వేగం పెంచి సీఎం కేసీఆర్ విధించిన గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులు, వర్క్స్ ఏజెన్సీని అదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం ఆయన సెక్రటేరియట్,అమర వీరుల స్మారక చిహ్నం పనులను క్షేత్ర స్థాయిలో క్షుణ్నంగా పరిశీలించారు. ఉదయం సెక్రటేరియట్ నిర్మాణ ప్రాంగణానికి చేరుకుని మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి వివిధ పనులు పరిశీలించారు. సుమారు నాలుగు గంటల పాటు నిర్మాణ ప్రాంగణమంతా కలియతిరిగారు.
గ్రాండ్ ఎంట్రీ, రెడ్ సాండ్ స్టోన్ జీఆర్సీ క్లాడింగ్ పనులు, పోర్టికో స్లాబింగ్ పనులు, విండోస్ స్ట్రక్చరల్ గ్లేనింగ్, కాంపౌండ్ వాల్ రేయిలింగ్ పనులు, సీఎం చాంబర్, మంత్రుల చాంబర్స్, సెక్రెటరీల చాంబర్స్, వివిధ శాఖలకు సంబంధించిన వర్క్ స్టేషన్ ఏరియా పనుల పురోగతిని పరిశీలించారు. వర్క్ స్టేషన్ ఏరియాలో సీటింగ్, కంప్యూటర్తోపాటు ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసే సౌకర్యాలను పరిశీలించి వర్క్స్ ఏజెన్సీకి పలు సూచనలు చేశారు.
అక్కడే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం చాంబర్, మంత్రుల చాంబర్, ఆఫీసర్స్ చాంబర్స్ ఫర్నీచర్ డిజైన్లు ఫైనల్ చేశారు. సీఎం చాంబర్తోపాటు వీవీఐపీ లాంజ్లో ఉపయోగించే టైల్స్ పరిశీలించారు. గ్రానైట్ ఫ్లోర్ స్టెప్స్ టైల్స్ ఫైనలైజ్ చేశారు. కోర్ట్ యార్డ్, ప్రైమ్ ఏరియా లైటింగ్ బిగింపు ఫైనల్ చేశారు. గ్రాండ్ ఎంట్రీ మెయిన్ డోర్ కు సంబంధించి ఆర్కిటెక్ట్ ఆస్కార్ పొన్ని రూపొందించిన పలు డిజైన్లు పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ సూచనల మేరకు వాటిని ఫైనలైజ్ చేయనున్నారు.
పోయిన విజిట్లో మంత్రి మ్యాన్ పవర్ పెంచాలని వర్క్స్ ఏజెన్సీని అదేశించారు.అందుకు తగట్టు.. అప్పుడు 1,450 మంది ఉండగా ప్రస్తుతం మ్యాన్ పవర్ 2,118 కి పెంచి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు. దీంతో ఫినిషింగ్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ విధించిన గడువులోగా ఫ్లోర్ వైస్ సమాంతరంగా నిర్మాణ పనులు పూర్తి కావాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆర్ అండ్ బీ అధికారులను, వర్క్ ఏజెన్సీని అదేశించారు.
అనంతరం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హుస్సేన్ సాగర్ ఒడ్డున నిర్మిస్తున్న అమరవీరుల స్మారక చిహ్నం పనుల పురోగతి పరిశీలించారు. సుమారు మూడున్నర గంటల పాటు నిర్మాణ ప్రాంగణం అంతా కలియతిరిగారు. ఫినిషింగ్ పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వేగంగా పూర్తి చేయాలని సూచించారు. మెయిన్ ఎంట్రీ, తెలంగాణ తల్లి విగ్రహం,గార్డెన్ ఏరియా, పై అంతస్థులో నిరంతరం వెలుగుతున్న జ్యోతి ఆకృతి వచ్చే నిర్మాణాన్ని, మ్యూజియం, గ్యాలరీతో పాటు ఫ్లోర్ వైస్ పనులు పరిశీలించారు. అధికారులకు, వర్క్ ఏజెన్సీకి పలు సూచనలు చేశారు. ప్యానెల్స్ బిగింపు ప్రక్రియ వేగిరం చేయాలని సూచించారు. ఈ నిర్మాణం తెలంగాణ ప్రజల సెంటిమెంట్ అని, ప్రతి పని మనసుపెట్టి చేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ అందుకే ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కావాలని మంత్రి అదేశించారు. మంత్రి వెంట ఈఎన్సీ గణపతిరెడ్డి, ఎస్ఈలు సత్యనారాయణ, హఫీజుద్దీన్, లింగారెడ్డి, ఈఈలు శశిధర్, నర్సింగరావు, ఆర్కిటెక్ట్ ఆస్కార్, వాస్తు నిపుణులు సుధాకర్ తేజ, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, పలువురు ఆర్అండ్బీ అధికారులున్నారు.